PV Sindhu: సింధు అదే తీరు.. మరో టోర్నీలో చుక్కెదురు

  • కొరియా ఓపెన్‌లో తొలి రౌండ్‌లోనే ఓడిన అగ్ర షట్లర్
  • కిడాంబి శ్రీకాంత్ కూడా ఇంటిదారి
  • ఈ ఏడాది ఒక్క టైటిల్‌ నెగ్గని ఇరువురు షట్లర్లు
PV Sindhu crashes out of Korea Open in First round

భారత బ్యాడ్మింటన్ అగ్ర క్రీడాకారిణి పీవీ సింధు కొన్నాళ్లుగా ఆటలో తడబడుతోంది. గాయం కారణంగా నాలుగైదు నెలలు ఆటకు దూరంగా ఉన్న ఆమె పునరాగమనంలో లయ కోల్పోయింది. వరుస టోర్నీల్లో నిరాశ పరుస్తోంది. ఈ ఏడాది ఇప్పటిదాకా ఒక్క టైటిల్ కూడా నెగ్గని సింధుకు మరో టోర్నీలోనూ చుక్కెదురైంది. కొరియా ఓపెన్ సూపర్‌‌ 500 టోర్నమెంట్‌లో సింధుకు తొలి రౌండ్‌లో పరాజయం పాలైంది. ఆమెతో పాటు మరో తెలుగు షట్లర్ కిడాంబి శ్రీకాంత్ కూడా ఆరంభ రౌండ్‌లోనే ఓడి ఇంటిదారి పట్టాడు. మహిళల సింగిల్స్‌లో సింధు 18-21, 21-10, 13-21తో పై యు పొ (చైనీస్‌ తైపీ) చేతిలో పరాజయం పాలైంది.

పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్‌ 21-12, 22-24, 17-21తో ప్రపంచ వరల్డ్‌ మాజీ నంబర్‌ వన్‌ ఆటగాడు కెంటో మొమోటా (జపాన్‌) చేతిలో ఓడాడు. సింధు మాదిరిగా ఈ ఏడాది ఒక్క టోర్నీ గెలవని శ్రీకాంత్‌కు కెంటో చేతిలో ఇది వరుసగా 12వ పరాజయం కావడం గమనార్హం. బరిలో నిలిచిన ఇతర భారత ఆటగాళ్లలో హెచ్ ఎస్ ప్రణయ్‌ 21-13, 21-17తో జులెన్‌ కరాగీ (బెల్జియం)పై, ప్రియాన్షు రాజావత్‌ 21-15, 21-19తో స్థానిక ప్లేయర్‌ చోయ్‌ జి హూన్‌పై విజయం సాధించి రెండో రౌండ్లోకి ప్రవేశించారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సిక్కిరెడ్డి-రోహన్‌ కపూర్ జంట కూడా శుభారంభం చేసింది.

More Telugu News