TDP: ఎన్డీయే, ప్రతిపక్ష కూటమికి సమాన దూరంగా టీడీపీ

  • కొన్ని పార్టీలను దూరం పెట్టిన అధికార, ప్రతిపక్ష కూటములు
  • తటస్థ వైఖరి అవలంబిస్తున్న మరికొన్ని పార్టీలు
  • ఆయా రాష్ట్రాల్లోని రాజకీయ సమీకరణలే కారణం
  • ఒంటరిగా మారిన బీఆర్ఎస్
TDP Stay Away To Opposition Alliance

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏకమైన ప్రతిపక్ష కూటమితోపాటు అధికార ఎన్డీయేకు సమాన దూరం పాటించాలని టీడీపీ నిర్ణయించింది. అలాగే, బీఎస్పీ, బీజేడీ, జేడీఎస్, బీఆర్ఎస్, వైసీపీ, ఎంఐఎం, అసోంలోని ఏఐడీయూఎఫ్ వంటి పార్టీలు కూడా ఈ రెండు కూటములకు దూరంగా ఉండాలని నిర్ణయించాయి. ఆయా రాష్ట్రాల్లోని రాజకీయ సమీకరణాలే అందుకు కారణమని తెలుస్తోంది.

ఈ పార్టీల్లో కొన్ని తటస్థ వైఖరి అవలంబిస్తుండగా, మరికొన్నింటిని ఈ రెండు కూటములు ఆహ్వానించకపోవడం గమనార్హం. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి నడిచిన కర్ణాటకలోని జేడీఎస్ ఈసారి కమలం గూటికి చేరేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల భేటీకి దానికి పిలుపు అందలేదు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగుచట్టాలను వ్యతిరేకిస్తూ అప్పట్లో శిరోమణి అకాలీదళ్ ఎన్డీయే నుంచి బయటకు వచ్చింది. ఇప్పుడు మళ్లీ రమ్మని కోరుతున్నా ఆ పార్టీ చీఫ్ సుఖ్‌బీర్‌సింగ్ బాదల్ ససేమిరా అన్నారు. మరోవైపు, ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ, ఆర్ఎల్‌డీ, కాంగ్రెస్ పొత్తుకు యత్నిస్తున్నాయి. దీంతో ఒంటరిగా మారిన బీఎస్పీ చీఫ్‌ మాయావతికి ప్రతిపక్షాల సమావేశానికి ఆహ్వానం అందలేదు.

ఒడిశాలోని అధికార బిజూ జనతాదళ్ (బీజేడీ) గతంలో ఎన్డీయేకు మద్దతు ఇచ్చినప్పటికీ 2004 నుంచి తటస్థంగా ఉంటోంది. అయితే, కీలక బిల్లులకు మాత్రం పార్లమెంటులో ఎన్డీయేకు మద్దతు ఇస్తోంది. బీహార్‌లో పోటీ చేయడం ద్వారా తమ ఓటుబ్యాంకును చీల్చి బీజేపీకి లాభం చేకూర్చిందని ఆరోపణలున్న ఎంఐఎంను కూడా ప్రతిపక్షాలు పిలవలేదు. గతంలో ఎన్డీయేలో ఉండి, ఆ తర్వాత బయటకు వచ్చి, మళ్లీ ఇప్పుడు అటువైపు చూస్తున్న టీడీపీ తటస్థ వైఖరి అవలంబిస్తోంది. కాంగ్రెస్, బీజేపీలను ప్రత్యర్థులుగా పరిగణిస్తున్న కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్‌కు కూడా విపక్ష కూటమి నుంచి ఆహ్వానం అందలేదు.

More Telugu News