Pilli Subhas Chandra Bose: మంత్రితో విభేదాలు.. జగన్‌కు ఫిర్యాదు చేసిన పిల్లి సుభాష్ చంద్రబోస్

  • ఎంపీ అనుచరుడిపై చేయి చేసుకున్న మంత్రి వేణు వర్గం నాయకుడు
  • తాడేపల్లిలో సీఎం జగన్‌తో అరగంటపాటు సుభాష్ చంద్రబోస్ భేటీ
  • మంత్రి వేణు, ఆయన అనుచరుల తీరును జగన్ దృష్టికి తీసుకువెళ్లిన ఎంపీ
Pilli Subhash Chandrabose complaints on minister Venugopalakrishna

రామచంద్రపురం నియోజకవర్గం వైసీపీలో కుమ్ములాటలు తారస్థాయికి చేరుకున్నాయి. ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణల మధ్య కొన్నిరోజులుగా ఘర్షణ వాతావరణం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా పిల్లి సుభాష్ చంద్రబోస్.. మంత్రిపై పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ కు ఫిర్యాదు చేశారు. అధినేతతో దాదాపు అరగంట పాటు భేటీ అయి, నియోజకవర్గంలో మంత్రి కారణంగా తాను, తన వర్గీయులు ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెట్టారని తెలుస్తోంది. ఇటీవలే తన అనుచరుడు శివాజీపై మంత్రి అనుచరుడు దాడి చేశారని ఫిర్యాదు చేశారు.

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో వైసీపీలో రోజురోజుకు విభేదాలు పెరుగుతున్నాయి. ద్రాక్షారామంలో ఎంపీ వర్గీయులు సమావేశమై.. రానున్న ఎన్నికల్లో సుభాష్ చంద్రబోస్ తనయుడు సూర్య ప్రకాశ్ కు టిక్కెట్ ఇవ్వాలని, మంత్రి వేణుగోపాలకృష్ణకు ఇస్తే ఓడిస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా సోమవారం ఉదయం మంత్రి సమక్షంలో ఆయన అనుచరుడు... మున్సిపల్ వైస్ చైర్మన్ శివాజీపై దాడి చేశారు. కాలర్ పట్టుకొని నిలదీశారు. శివాజీ.. సుభాష్ చంద్రబోస్ వర్గీయుడు. ఈ నేపథ్యంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ అధినేతకు ఈ రోజు ఫిర్యాదు చేశారు.

More Telugu News