YS Vivekananda Reddy: వైఎస్ వివేకా హత్య కేసుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

  • వివేకా హత్య కేసు కీలకమైన అంశమన్న సుప్రీంకోర్టు
  • హత్య కేసు వివరాలు, డైరీని సీల్డ్ కవర్ లో అందించాలని సీబీఐకి ఆదేశం
  • అవినాశ్, గంగిరెడ్డి బెయిల్ పిటిషన్లను కలిపే వింటామని స్పష్టీకరణ
  • గంగిరెడ్డికి వెంటనే బెయిల్ మంజూరు చేయాలన్న న్యాయవాదిపై ఆగ్రహం
  • తదుపరి విచారణను సెప్టెంబర్ 2కు వాయిదా వేసిన ధర్మాసనం
Avinash Bail Case in SC

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వివేకా హత్య కేసు చాలా కీలకమైన అంశమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలనే పిటిషన్ ను సెప్టెంబర్ 2వ వారానికి వాయిదా వేసింది. వివేకా హత్య కేసు వివరాలు, డైరీని సీల్డ్ కవర్ లో అందించాలని సీబీఐని ఆదేశించింది. అవినాశ్ బెయిల్ రద్దు పిటిషన్ పై కౌంటర్ ను సీల్డ్ కవర్ లో దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 

అవినాశ్ రెడ్డి, మరో నిందితుడు గంగిరెడ్డి బెయిల్ పిటిషన్లను కలిపే వింటామని సుప్రీం స్పష్టం చేసింది. గంగిరెడ్డి బెయిల్ పిటిషన్ పై వాదనలను వేరుగా వినాలని ఆయన తరపు లాయర్ విన్నవించిన నేపథ్యంలో సుప్రీం ఈ మేరకు స్పష్టతనిచ్చింది. ఇద్దరి బెయిల్ పిటిషన్లను జత చేసింది. గంగిరెడ్డికి వెంటనే బెయిల్ మంజూరు చేయాలన్న ఆయన న్యాయవాదిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. హత్యకేసుకు సంబంధించిన బెయిల్ వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పింది. ఎన్నో సాక్ష్యాలను పరిశీలించాల్సి ఉంటుందని... బెయిల్ కోసం వేచిచూడక తప్పదని తెలిపింది. గంగిరెడ్డికి జూన్ 30న బెయిల్ ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఇప్పటికే స్టే ఇచ్చిన సుప్రీంకోర్టు... అవే ఉత్తర్వులు కొనసాగుతాయని చెప్పింది.

More Telugu News