AI: ఏఐనీ వాడేస్తున్న సైబర్ నేరగాళ్లు.. ముఖం మార్చుకుని స్నేహితుడిలా నమ్మించి రూ. 40 వేలు కొట్టేసిన మాయగాడు!

  • కేరళలోని కోజికోడ్‌లో ఘటన
  • వాట్సాప్‌లో వీడియో కాల్ చేసి మరీ డబ్బులు అడిగిన వైనం
  • తన స్నేహితుడేనని నమ్మి డబ్బులు పంపిన బాధితుడు
  • మరోమారు అడగడంతో అనుమానం
  • స్నేహితుడిని ఆరా తీస్తే బయటపడిన అసలు నిజం 
Cyber Criminal Change His Face and extort money

సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ని కూడా వాడేస్తున్నారు. ఏఐ సాయంతో ఓ వ్యక్తి తన ముఖాన్ని మరొకరిలా మార్చుకుని అతడి స్నేహితుడికి ఫోన్ చేసి రూ. 40 వేలు నొక్కేశాడు. కేరళలో జరిగిందీ ఘటన. కోజికోడ్‌కు చెందిన రాధాకృష్ణకు గుర్తు తెలియని నంబరు నుంచి వాట్సాప్ వీడియో కాల్ వచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్‌లో ఉంటున్న తన స్నేహితుడిలా ఉండడంతో రాధాకృష్ణ మాటలు కొనసాగించాడు. కాసేపు మాట్లాడిన తర్వాత మోసగాడు అసలు విషయం చెప్పాడు. తాను ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నానని, తన బంధువుల చికిత్స కోసం డబ్బులు కావాలని, ఇండియాకు రాగానే ఇచ్చేస్తానని, అర్జెంటుగా తనకో రూ. 40 వేలు పంపమని కోరాడు. 

అతడు తన స్నేహితుడేనని భావించిన రాధాకృష్ణ రూ. 40 వేలు ట్రాన్స్‌ఫర్ చేశాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు మరోమారు ఫోన్ చేసి రూ. 35 వేలు కావాలని అడగడంతో అనుమానించిన రాధాకృష్ణ తన స్నేహితుడిని సంప్రదించడంతో అసలు విషయం తెలిసి షాకయ్యాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని గుర్తించి సొమ్మును స్వాధీనం చేసుకుని రాధాకృష్ణకు అప్పగించారు.

More Telugu News