muthireddy yadagiri reddy: నా తండ్రి అవినీతిపరుడు.. టిక్కెట్ ఇవ్వొద్దు: ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కూతురు

  • తన తండ్రిని ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారో తెలియదన్న తుల్జాభవానీ
  • ఎమ్మెల్యేను ఓడించాల్సింది ప్రజలే అన్న ఎమ్మెల్యే కూతురు
  • రాజకీయాలపై ఆసక్తి లేదని స్పష్టీకరణ
Muthireddy daughter shocking comments on father

జనగామ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపై కూతురు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో బహిరంగంగానే తండ్రితో వాదనకు దిగిన ఆయన కూతురు తుల్జాభవానీరెడ్డి... తాజాగా తన తండ్రి అవినీతిపరుడని, అసలు ఆయనను ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారో తెలియదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేను ప్రశ్నించాల్సింది.. ఓడించాల్సింది ప్రజలే అన్నారు. ప్రజల ఆస్తిని తాను తిరిగి ఇచ్చేసినట్లు చెప్పారు. తన తండ్రి నుండి రూపాయి కూడా తాను తీసుకోలేదన్నారు. కుటుంబం నుండి తనకు ఎలాంటి మద్దతు లేదన్నారు.

భూకబ్జా చేసినట్లు ఒక ఎమ్మెల్యే బహిరంగంగా చెప్పినప్పటికీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. ఇటువంటి అవినీతిపరులకు పార్టీ టిక్కెట్ ఇవ్వకూడదని, సొంతంగా పోటీ చేసినా సర్పంచ్‌గా కూడా తన తండ్రి గెలవలేడన్నారు. కేవలం కేసీఆర్ పేరు చెప్పుకొని ఎన్నికల్లో గెలిచారని విమర్శించారు. తనకు రాజకీయాలపై ఎలాంటి ఆసక్తి లేదని, తన వెనుక ఏ పార్టీ లేదని స్పష్టం చేశారు. కబ్జా చేసిన తన తండ్రిని వదిలేసి, తనపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. జనగామకు వెళ్లి అడిగితే తన తండ్రి గురించి ప్రతి ఒక్కరు చెబుతారన్నారు. ఇప్పుడిప్పుడే తన తండ్రి బాధితులు ఫోన్ చేస్తున్నారని, బయటకొస్తున్నారని ఆమె చెప్పారు.

More Telugu News