Jasprit Bumrah: ఐర్లాండ్ టూర్‌తో బుమ్రా రీ ఎంట్రీ.. ద్రవిడ్ సహా కోచింగ్ స్టాఫ్‌కు విశ్రాంతి

  • వచ్చే నెల 18 నుంచి ఐర్లాండ్‌లో పర్యటించనున్న భారత జట్టు
  • ద్రవిడ్ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్‌కు బాధ్యతలు
  • శ్రేయాస్ అయ్యర్ రాకపై లేని స్పష్టత
Jasprit Bumrah would be making a comeback in Ireland Series

ప్రపంచకప్‌కు ముందు పర్యటనలతో భారత జట్టు బిజీగా ఉంది. ప్రస్తుతం విండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా వచ్చే నెలలో ఐర్లాండ్ టూర్‌కు వెళ్లనుంది. ఈ సిరీస్‌లో భారత్ మూడు టీ20 మ్యాచ్‌లు ఆడుతుంది. ఈ సిరీస్‌లో రాహుల్ ద్రవిడ్ సహా కోచింగ్ స్టాఫ్‌ మొత్తానికి విశ్రాంతి ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. విండీస్ పర్యటన ముగిసిన వెంటనే వీరిని రిలీవ్ చేయనున్నట్టు తెలుస్తోంది. ద్రవిడ్‌కు విశ్రాంతి నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్‌కు ఆ బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. అలాగే సీతాన్షు కోటక్, హృషికేశ్ కనిత్కర్ బ్యాటింగ్ కోచ్‌లుగా, ట్రో కూలీ, సాయిరాజ్ బహుతులే బౌలింగ్ కోచ్‌లుగా వ్యవహరించనున్నారు. 

ఐర్లాండ్ టూర్‌లో భాగంగా ఆగస్టు 18న తొలి టీ20 జరగనుండగా 20, 23న రెండు, మూడు మ్యాచ్‌లు జరగుతాయి. మూడు మ్యాచ్‌లు డబ్లిన్‌లోనే జరగనున్నాయి. గాయంతో చాలా కాలంగా జట్టుకు దూరమైన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ సిరీస్‌తో తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. కేఎల్ రాహుల్ అందుబాటులో ఉండడం లేదు. శ్రేయాస్ అయ్యర్ విషయంలో ఇంకా స్పష్టత రాలేదు.

More Telugu News