పవన్ కల్యాణ్ మాటల్లో జగన్ పై అసూయ కనిపిస్తోంది: మంత్రి దాడిశెట్టి రాజా

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, ఈసారి పోటీ యుద్ధాన్ని తలపించేలా ఉంటుందనడంలో సందేహం లేదు. వైసీపీ, జనసేన నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు ముదిరాయి. ముఖ్యంగా సీఎం జగన్, పవన్ కల్యాణ్ ల మధ్య విమర్శల పర్వం వ్యక్తిగత అంశాల వరకు వెళ్లింది. వాలంటీర్లపై పవన్ వ్యాఖ్యలతో అగ్నికి ఆజ్యం పోసినట్టయింది.

ఈ నేపథ్యంలో, పవన్ పై వైసీపీ మంత్రులు వాగ్బాణాలు సంధిస్తున్నారు. తాజాగా మంత్రి దాడిశెట్టి రాజా కూడా పవన్ పై ధ్వజమెత్తారు. పవన్ మాట్లాడుతున్న తీరు గమనిస్తే సీఎం జగన్ పై అసూయ కనిపిస్తోందని అన్నారు. వారాహి యాత్రలో పవన్ ఉపన్యాసాలు జగన్ పై ఈర్ష్యతో సాగుతున్నాయని విమర్శించారు. మైక్ చేతిలో ఉంది కదా అని నోటికొచ్చినట్టు పిచ్చిగా మాట్లాడడం తప్పితే, పవన్ కు రాష్ట్రం గురించి ఏం తెలుసని ప్రశ్నించారు. 

పవన్ కళ్లలో ఓటమి స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. వచ్చే ఎన్నికలు జనసేన, టీడీపీలకు ఆఖరు అని మంత్రి దాడిశెట్టి రాజా జోస్యం చెప్పారు. ఆ రెండు పార్టీలను జనం సముద్రంలో కలిపేస్తారని వ్యాఖ్యానించారు.


More Telugu News