YS Avinash Reddy: వైఎస్ వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డికి సమన్లు, ఎనిమిదో నిందితుడిగా చేర్చిన సీబీఐ

  • అవినాశ్ రెడ్డి ప్రమేయంపై చివరి ఛార్జీషీట్‌లో సీబీఐ అభియోగాలు
  • ఆగస్ట్ 14న హాజరు కావాలని పేర్కొన్న కోర్టు
  • జైల్లో ఉన్న నిందితులంతా విచారణకు హాజరు
CBI court issues notices to MP Avinash Reddy

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైసీపీ నేత, కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ హత్య కేసులో కడప ఎంపీని 8న నిందితుడిగా చేర్చింది. అవినాశ్ రెడ్డి ప్రమేయంపై చివరి ఛార్జిషీట్‌లో సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. ఈ కేసులో అవినాశ్ రెడ్డితో పాటు వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలపై ఇటీవల సీబీఐ దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీటును సీబీఐ కోర్టు పరిగణనలోకి తీసుకుంది.

అవినాశ్ రెడ్డిని ఎనిమిదో నిందితుడిగా చేర్చి, ఆగస్ట్ 14న కోర్టుకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. ఈ కేసులో ఆరో, ఏడో నిందితులుగా భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఏప్రిల్ 14న ఉదయ్ కుమార్ రెడ్డిని, 16న భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. 

ఈ రోజు సీబీఐ కోర్టులో విచారణ జరగగా జైలులో ఉన్న నిందితులను పోలీసులు హాజరుపరిచారు. వారికి రిమాండ్ ను ఆగస్ట్ 14 వరకు పొడిగించింది. అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పై ఉన్నారు. దీంతో కోర్టుకు హాజరయ్యే బాధ్యతను సీబీఐకి కోర్టు అప్పగించింది.

More Telugu News