MS Dhoni: భార్య సినిమా నిర్మిద్దాం అనగానే ధోనీ రియాక్షన్ ఇదే!

  • ధోనీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌ స్థాపించిన దిగ్గజ క్రికెటర్
  • మొదటి సినిమాగా ఎల్జీఎం నిర్మాణం
  • తమిళ్ తో పాటు తెలుగులో విడుదల కానున్న చిత్రం
This is the first reaction from dhoni when his wife asked him to make a film

భారత క్రికెట్ చరిత్రలో దిగ్గజ ఆటగాడిగా, అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా చరిత్ర సృష్టించిన మ‌హేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ తర్వాత పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాడు. ఈ మధ్యే చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టాడు. ధోనీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌ ను స్థాపించి మొదటి సినిమాగా ఎల్జీఎం (లెట్స్ గెట్ మ్యారీడ్) అనే సినిమాను రూపొందిస్తున్నాడు. 

త‌మిళంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని తెలుగులోనూ విడుద‌ల చేస్తున్నారు. హ‌రీశ్ క‌ళ్యాణ్‌, ఇవానా జంటగా న‌దియా, యోగిబాబు కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రాన్ని ర‌మేష్ త‌మిళ్ మ‌ణి తెరకెక్కించారు. ధోనీ భార్య సాక్షి, వికాస్ హ‌స్జా నిర్మాతలుగా ఉన్నారు. ఈ చిత్రం ట్రైల‌ర్‌ను తాజాగా చెన్నైలో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ధోనీ దంపతులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మహేంద్ర సింగ్ ధోనీ మాట్లాడుతూ.. సినిమా చేద్దామని సాక్షి ప్రస్తావించినప్పుడు తమ మధ్య జరిగిన సంభాషణను వెల్లడించాడు. సినిమా చేయ‌టం అంటే ఓ ఇంటిని డిజైన్ చేసిన‌ంత సులువు కాదని అన్నానని తెలిపాడు. సాక్షి ఓ ఇంటీరియర్ డిజైనర్. ‘నువ్వు ఓ క‌థ‌ను ఫిక్స్ చేసుకుని, న‌టీన‌టులను కూడా ఎంపిక చేసుకో. ఒక్కసారి ఓకే అన్న‌ త‌ర్వాత సినిమా చేస్తాను’ అని చెప్పానని వెల్లడించాడు. అలా ఈ సినిమాను మొదలు పెట్టామని మంచి టీమ్ ఉండటంతో తక్కువ స‌మ‌యంలోనే  పూర్తి చేశామని తెలిపాడు. షూటింగ్ సమయంలో సినిమా యూనిట్‌కు మంచి ఆహారం ఉండేలా చూసుకోమ‌ని సాక్షికి చెప్పానన్నాడు.

More Telugu News