mallu ravi: మాకు తెలంగాణలో 100 సీట్లు, లోక్ సభ ఎన్నికల్లో 300 సీట్లు: కాంగ్రెస్ నేత మల్లు రవి

  • భారత్ జోడో యాత్ర తర్వాత కాంగ్రెస్ కు దేశవ్యాప్తంగా అనుకూల పరిస్థితి అన్న మల్లు రవి
  • చిన్న తప్పుకు రాహుల్ గాంధీకి రెండేళ్ల శిక్ష వేశారని ఆవేదన
  • బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని విమర్శ
Mallu Ravi says Congress will win 100 seats in Telangana

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ 100కు పైగా స్థానాలు గెలిచి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ సత్యాగ్రహ నిరసన దీక్షను చేపట్టారు. ఈ కార్యక్రమంలో మల్లు రవి మాట్లాడుతూ... రాహుల్ భారత్ జోడో యాత్ర తర్వాత హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలలో కాంగ్రెస్ గెలిచిందని, రేపు తెలంగాణలో, మధ్యప్రదేశ్ లో, రాజస్థాన్ లో, చత్తీస్‌గఢ్‌లో  గెలుస్తుందని, ఆ తర్వాత లోక్ సభ ఎన్నికల్లోనూ 300 సీట్లతో విజయం సాధిస్తుందన్నారు. 

రాహుల్ గాంధీ జోడో యాత్ర తర్వాత దేశంలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని, కాంగ్రెస్ కు అనుకూలంగా ప్రజలు ఉన్నారన్నారు. కాంగ్రెస్ వస్తేనే.. అదీ రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే దేశానికి మేలు జరుగుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. ఇలాంటి సమయంలో మోదీ ప్రభుత్వం ఒక చిన్న తప్పుతో రాహుల్ గాంధీకి రెండేళ్ల శిక్ష వేశారన్నారు. ఈ నేపథ్యంలో తమ పార్టీ అగ్రనేతకు మద్దతుగా ఈ సత్యాగ్రహ మౌన దీక్ష చేపట్టినట్లు చెప్పారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వెనుక, ఆయనకు సెక్యూరిటీని తీసివేయడం వెనుక బీజేపీ ఉందని ఆరోపించారు.

ప్రస్తుతం తెలంగాణలోనూ కాంగ్రెస్ గెలిచే పరిస్థితులు ఉన్నాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ ప్రజల దృష్టిని మరల్చేందుకు, బీజేపీకి నష్టం జరగకుండా... టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తెరపైకి తీసుకువచ్చాయని ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటే అన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ఈ రెండు పార్టీలు అవగాహనతో ముందుకు సాగుతాయని, ఈ విషయంపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు.

More Telugu News