ST Student Killed: ఏలూరు జిల్లాలో దారుణం.. వసతిగృహం నుంచి కిడ్నాప్ చేసి నాలుగో తరగతి బాలుడి దారుణ హత్య

  • అర్ధరాత్రి వేళ విద్యుత్ సరఫరా నిలిపివేసి హాస్టల్‌లోకి చొరబడిన దుండగులు
  • బాలుడిని గొంతునులిమి చంపేసి పాఠశాల ఆవరణలో పడేసిన వైనం
  • బతకాలని అనుకున్నవారు వెళ్లిపోవాలని.. లేదంటే ఇలాంటివి రిపీట్ అవుతుంటాయని లేఖ
4th Class ST student kidnapped and brutally killed in Eluru district

ఏలూరు జిల్లాలో అత్యంత దారుణ ఘటన జరిగింది. గిరిజన సంక్షేమ వసతిగృహంలో ఉండి చదువుకుంటున్న నాలుగో తరగతి గిరిజన విద్యార్థిని కిడ్నాప్ చేసిన దుండగులు అత్యంత దారుణంగా చంపేశారు. జిల్లాలోని బుట్టాయగూడెం మండలం పులిరాముడుగూడెంలో సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన సంచలనం రేకెత్తించింది.

పోలీసుల కథనం ప్రకారం.. మన్యంలోని కుగ్రామమైన ఉర్రింకకు చెందిన గోగుల శ్రీనివాసరెడ్డి వలంటీరు. ఆయన భార్య రామలక్ష్మి ఆశా కార్యకర్త. వీరి ఇద్దరు కుమారుల్లో పెద్ద కుమారుడు హర్షవర్ధన్‌రెడ్డి ఆరో తరగతి, చిన్నవాడైన అఖిల్‌వర్ధన్‌రెడ్డి (9) నాలుగో తరగతి చదువుతున్నారు. 

సోమవారం అర్ధరాత్రి అందరూ నిద్రపోతున్న సమయంలో హాస్టల్‌లోకి ప్రవేశించిన ఇద్దరు దుండగులు విద్యుత్ సరఫరా నిలిపివేసి అఖిల్‌వర్ధన్‌రెడ్డిని బలవంతంగా ఎత్తుకుని బయటకు తీసుకెళ్లారు. అనంతరం హత్య చేసి సమీపంలోని గిరిజన సంక్షేమ పాఠశాల ఆవరణలో పడేశారు. మృతదేహంపై ఉన్న ఆనవాళ్లను బట్టి బాలుడిని గొంతు నులిమి హత్య చేసినట్టు తెలుస్తోంది. 

‘బతకాలనుకున్నవారు వెళ్లిపోండి. ఎందుకంటే ఇక నుంచి ఇలాంటివి జరుగుతుంటాయి.. ఇట్లు.. ’ అని రాసి వున్న లేఖను బాలుడి చేతిలో పెట్టి పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

More Telugu News