Kadiam Srihari: తల్లి సత్యం.. తండ్రి అపోహ.. ఇది రాజయ్యకు వర్తించదా?: కడియం సూటి ప్రశ్న

  • సింగపూర్, మలేసియా ఆస్తులను దళిత బిడ్డలకు రాసిస్తానన్న కడియం
  • తన ఆస్తుల వివరాలు వారంలో తీసుకు రావాలని సవాల్
  • వైఎస్ హయాంలోని ఎన్‌కౌంటర్లకు రాజయ్య బాధ్యత వహిస్తాడా? అని ప్రశ్న
Kadiyam Srihari challenges MLA Rajaiah

స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్యపై ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సోమవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తనపై చేసిన విమర్శలకు గాను కౌంటర్ ఇచ్చారు. రాజయ్య తన కులాన్ని ప్రస్తావించారని, ఆస్తులు సంపాదించుకున్నట్లు ఆరోపించారని, అలాగే తాను ఎన్ కౌంటర్ సృష్టికర్తనని విమర్శలు చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఇతర పట్టణాల్లో, ఇతర దేశాల్లో ఆస్తులు ఉంటే, అందుకు సంబంధించి రాజయ్య ఆధారాలు తీసుకు వస్తే తాను ఘనపుర్ దళిత బిడ్డలకు రాసిస్తానని సవాల్ చేశారు.

రాజయ్య గెలుపు కోసం తాను ఎంతో కృషి చేశానని, అయినా తనపై, తన కుటుంబంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఆయన వ్యాఖ్యలు బాధించాయన్నారు. ఈ విషయాన్ని గతంలోనే కేసీఆర్ దృష్టికి తీసుకు వెళ్లానని, సంయమనం పాటించమని కోరడంతో ఏం మాట్లాడలేదన్నారు. రాజయ్య తన స్థాయిని మించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్ అయినా పరిణతి లేకుండా మాట్లాడటం ఏమిటన్నారు. 

తన కులం గురించి, తన కూతురు కులం గురించి మాట్లాడటంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడైనా తండ్రి కులం పిల్లలకు వస్తుందని, తల్లి కులం కాదని, అదే చట్టం చెబుతోందన్నారు. ఇంకా తల్లి అనేది సత్యం.. తండ్రి అపోహ అని రాజయ్య తీవ్రవ్యాఖ్యలు చేశారని, ఈ వ్యాఖ్యలు కేవలం కడియం శ్రీహరికే వర్తిస్తాయా? లేక రాజయ్యకు వర్తించవా? అని ప్రశ్నించారు. నా తల్లి సూత్రం.. నా తండ్రి సూత్రం.. రాజయ్యకు కూడా వర్తిస్తాయన్నారు. ఆ మాటకు వస్తే సమాజంలోని ప్రతివారి పుట్టుకను ప్రశ్నించేలా రాజయ్య మాట్లాడారన్నారు.  ప్రతి తల్లిని అవమానించేలా, అనుమానించేలా ఉందన్నారు.

భారతదేశ కుటుంబ వ్యవస్థ తల్లి, తండ్రి అని ఉంటుందని, కుటుంబ వ్యవస్థను అవమానించేలా రాజయ్య ప్రకటన ఉన్నందుకు వెంటనే మహిళలందరికీ ముక్కు నేలకు రాసి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తల్లి సత్యం.. తండ్రి అపోహ అంటున్నావ్.. నీవు చదివిన డాక్టర్ ఇదే నేర్పించిందా? ఇదేనా నీ సభ్యత? అని దుయ్యబట్టారు. నా తల్లి బీసీ, నా తండ్రి ఎస్సీ.. సుప్రీం తీర్పు ప్రకారం తాను ఎస్సీనని చెప్పారు. ఇంత దుర్మార్గపు ప్రకటన చేస్తారా? అన్నారు.

ఎన్‌కౌంటర్ సృష్టికర్త వ్యాఖ్యలపై ఆగ్రహం

తాను దేవాదుల సృష్టికర్తను కాదు.. ఎన్ కౌంటర్ల సృష్టికర్తనని రాజయ్య అంటున్నారని, కానీ 2004 నుండి 2014 వరకు రాష్ట్రంలో ఎక్కువగా ఎన్ కౌంటర్లు జరిగాయని విమర్శించారు. 1994 నుండి 2004 వరకు తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నానని, కానీ అంతకుముందు, ఆ తర్వాత ఉమ్మడి ఏపీలో ఎన్ కౌంటర్లు లేవా? అని ప్రశ్నించారు.

2004 నుండి 2014 మధ్య వైఎస్ రాజశేఖరరెడ్డి, కాంగ్రెస్ హయాంలో నక్సలైట్లను చర్చలకు పిలిపించి, మభ్యపెట్టి ఎన్ కౌంటర్లు చేశారని ఆరోపించారు. ఆ రోజు రాజయ్య ఎక్కడ ఉన్నాడో చెప్పాలన్నారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీలో కొన్నేళ్లు ఎమ్మెల్యేగా ఉన్నాడని, అప్పుడు జరిగిన ఎన్ కౌంటర్లకు రాజయ్య బాధ్యత వహిస్తే, తానూ బాధ్యత వహిస్తానన్నారు. ఎన్ కౌంటర్ల సృష్టికర్తనని చెప్పడం హాస్యాస్పదమన్నారు. రాజయ్య ఒత్తిడిలో మాట్లాడుతున్నారన్నారు.

క్షమాపణ చెప్పాలి

తనకు గుంటూరు, హైదరాబాద్, బెంగళూరు, సింగపూర్, మలేసియా తదితర ప్రాంతాల్లో వేల కోట్ల ఆస్తులు ఉన్నట్లు రాజయ్య ఆరోపణలు చేశారని, కానీ వాటికి సంబంధించి డాక్యుమెంట్స్ తీసుకు వస్తే ఘనపుర్ దళితబిడ్డలకు రాసిస్తానని కౌంటర్ ఇచ్చారు. 'రాజన్నా.. నీకో సలహా. నీ వద్ద నా ఆస్తుల గురించి సమాచారం ఉంటే రేపు తీసుకు రా.. ఆ డాక్యుమెంట్స్ అన్నీ రేపు తీసుకు వస్తే నా ఘనపురం దళిత బిడ్డలకు రాసిస్తా' అన్నారు.

ఆ డాక్యుమెంట్స్ కోసం సమయం కావాలంటే వారం రోజులు గడువు ఇస్తానని, అప్పుడైనా తీసుకు రావాలన్నారు. లేదంటే తనపై చేసిన ఆరోపణలకు క్షమాపణలు చెప్పాలన్నారు. ఇందుకు వారం రోజులే డెడ్ లైన్ అన్నారు. నేను ఘనపూర్ కు ఏం చేయలేదని చెబుతున్నాడని, కానీ ఇక్కడి రిజర్వాయర్, సబ్ స్టేషన్, గురుకుల పాఠశాల, కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీలు తన హయాంలోనే వచ్చాయని చెప్పారు. నియోజకవర్గంలో రాజయ్యకు ఇష్టం వచ్చిన గ్రామాన్ని ఎంచుకొని.. అక్కడి బొడ్రాయి వద్దకు వస్తే నేను ఆ గ్రామానికి ఏం చేశానో చెబుతానన్నారు.

More Telugu News