mahakali bonalu: ఈ ఏడాది మంచి వర్షాలు కురుస్తాయి.. జోగిని స్వర్ణలత భవిష్యవాణి

  • వెన్నంటి ఉంటూ తన భక్తులను కాపాడుకుంటానని చెప్పిన జోగిని
  • భవిష్యవాణి వినేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు
  • ఉజ్జయిని మహంకాళి బోనాల వేడుకల్లో రంగం కార్యక్రమం
Rangam Bhavishyavani 2023

‘ఏ లోపం లేకుండా పూజలు నిర్వహించడం తృప్తి కలిగించింది. గతేడాది నాకు ఇచ్చిన వాగ్దానం మరిచారు’ అంటూ జోగిని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో జరుగుతున్న బోనాల వేడుకల్లో సోమవారం రంగం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా జోగిని స్వర్ణలత పచ్చి మట్టికుండపై నిలుచుని భవిష్యవాణి వినిపించారు.

ఈ ఏడాది వర్షాలు ఆలస్యమవుతున్నాయని పూజారులు అడుగగా.. వర్షాలు తప్పకుండా ఇస్తానని, ఆలస్యంగానైనా ఈ ఏడాది కూడా సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. జోగిని స్వర్ణలత చెప్పే భవిష్యవాణి వినేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు పలువులు నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఎల్లవేళలా వెన్నంటి ఉండి తన భక్తులను కాపాడుకుంటానని, బలాన్ని ఇస్తానని భవిష్యవాణిలో జోగిని చెప్పారు. అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని భయపడవద్దని, తన వద్దకు వచ్చే వారిని కాపాడుకునే భారం తనదేనని అన్నారు. ఎలాంటి లోపాలు లేకుండా చూసుకునే బాధ్యత తనదేనన్నారు. ఏ పూజలు చేసినా సంతోషంగా అందుకుంటున్నానని, ఐదు వారాల పాటు తప్పనిసరిగా ప్రసాదాలు సమర్పించాలని స్వర్ణలత చెప్పారు.

More Telugu News