Ram Gopal Varma: రెండు లక్షల పుస్తకాలు చదివిన పవన్ కల్యాణ్ కు ఇది తెలియదా?: రామ్ గోపాల్ వర్మ

  • ఏలూరు సభలో పవన్ కల్యాణ్ ప్రసంగం
  • వాలంటీర్లను టార్గెట్ చేస్తూ తీవ్ర ఆరోపణలు
  • వాక్ స్వాతంత్ర్యం ఉన్నది నిరాధార ఆరోపణలు చేయడానికి కాదన్న వర్మ
  • పవన్ చదువులేనితనం బయటపడిందని విమర్శలు
Ram Gopal Vrama criticizes Pawan Kalyan

ఏలూరు సభలో జనసేనాని పవన్ కల్యాణ్ ఏపీ వాలంటీర్ వ్యవస్థను టార్గెట్ చేస్తూ కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 17 వేల మంది అమ్మాయిల మిస్సింగ్ కు వాలంటీర్ వ్యవస్థే కారణమని కేంద్ర నిఘా వర్గాల నుంచి తనకు సమాచారం ఉందని అన్నారు. 

వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాలంటీర్లు... గ్రామంలో ఎవరు ఎవరి మనిషి, ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు, అందులో అమ్మాయిలు ఎంతమంది, వారికి ఏమైనా ప్రేమ వ్యవహారాలు ఉన్నాయా, వితంతువులు ఎంతమంది, మగవాళ్లకు ఏమైనా అలవాట్లు ఉన్నాయా? అనే వివరాలను సేకరిస్తారని, వాలంటీర్ల ద్వారా ఆ వివరాలు సంఘ వ్యతిరేక శక్తుల చేతుల్లోకి వెళుతున్నట్టు కేంద్ర నిఘా పెద్దలు తనకు చెప్పారని పవన్ వివరించారు. 

దాంతో ఆ సంఘ వ్యతిరేక శక్తులు అమ్మాయిలను ట్రాప్ చేసి మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్టు తెలిసిందని పవన్ మండిపడ్డారు. 

అయితే, ఈ వ్యాఖ్యలను ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తప్పుబట్టారు. వాక్ స్వాతంత్ర్యం ఉన్నది అభిప్రాయాలు చెప్పడానికి, భిన్నాభిప్రాయాలతో చర్చాకార్యక్రమాలతో వాదించడానికి అని స్పష్టం చేశారు. కానీ నిరాధార (జీరో ఎవిడెన్స్) ఆరోపణలు చేయడానికి కాదని పవన్ కు హితవు పలికారు. 

రెండు లక్షల పుస్తకాలు చదివిన పవన్ కల్యాణ్ కు ఇది తెలియకపోవడం అతడి చదువులేనితనాన్ని నిరూపిస్తోందని విమర్శించారు. ఈ మేరకు ఏలూరు సభలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యల వీడియోను కూడా వర్మ పంచుకున్నారు.

More Telugu News