Nara Lokesh: యువ‌గ‌ళం పాదయాత్రకు 150 రోజులు... నారా లోకేశ్ భావోద్వేగం

  • లోకేశ్ యువగళం పాదయాత్రకు నేడు 150వ రోజు
  • కావలి నియోజక వర్గం అల్లూరులో లోకేశ్ కు అపూర్వస్వాగతం
  • ఇస్కపల్లిలో ఉప్పు రైతులతో లోకేశ్ సమావేశం
  • రైతులకు ఇచ్చినట్టే ఉప్పురైతులకు కూడా అన్ని సబ్సిడీలు ఇస్తామని హామీ
Lokesh held meeting with salt farmers

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర నేటితో 150 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా లోకేశ్ ప్రత్యేక సందేశం వెలువరించారు. నాలుగేళ్ల క్రితం జ‌నం ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి క‌రోనా వైర‌స్ కంటే ప్ర‌మాద‌క‌ర‌మైన జ‌గ‌నోరా వైర‌స్ సోకిందని తెలిపారు. 

రాష్ట్రంలో అభివృద్ధి జరగకపోగా, విధ్వంసం తీవ్ర‌స్థాయికి చేరిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్ర‌జ‌లు క‌ష్టాల్లో ఉంటే ఆదుకోవాల్సిన ప్ర‌భుత్వం దోపిడీ దొంగ‌ల తీరుగా మారిందని, ప్ర‌జాస్వామ్యం ఖూనీ అయ్యిందని విచారం వెలిబుచ్చారు. రాజ్యాంగాన్ని తుంగ‌లో తొక్కేశారని మండిపడ్డారు. 

"సైకో పాల‌కుల‌పై ప్ర‌జ‌ల్ని చైత‌న్యం చేయ‌డానికి స‌రిగ్గా ఐదు నెల‌ల క్రితం కుప్పంలో తొలి అడుగు వేశాను. నా యువ‌గ‌ళం జ‌నగ‌ళ‌మైంది. యువ‌త త‌మ భ‌విత కోసం సైన్య‌మై నా వెంట న‌డుస్తున్నారు. ప్ర‌జ‌ల క‌ష్టాలు చూశాను. క‌న్నీళ్లు తుడిచాను. స‌క‌ల‌వ‌ర్గాలు సైకో పాల‌న బాధితులయ్యారు. అంద‌రికీ అండ‌గా నిలుస్తామ‌ని భ‌రోసా ఇచ్చాను. అడుగ‌డుగునా అడ్డంకులు, సైకో స‌ర్కారు వేధింపుల‌ను అధిగ‌మించి యువ‌గ‌ళం పాద‌యాత్రని జ‌నం జైత్ర‌యాత్ర చేశారు. 

జ‌న‌మే బ‌ల‌మై, బ‌ల‌గ‌మై యువ‌గ‌ళం పాద‌యాత్ర 150 రోజులు పూర్తి చేసుకుంది. యువ‌గ‌ళం అప్ర‌తిహ‌త ప్ర‌యాణంలో భాగ‌మైన ప్ర‌జ‌లు, టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులు, యువ‌గ‌ళం క‌మిటీలు, వ‌లంటీర్లు, భ‌ద్ర‌తాసిబ్బంది, మీడియాకి హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను. మీ ప్రేమ‌ని పొందాను. మీ ఆప్యాయ‌త‌ని అందుకున్నాను. మీ ఆతిథ్యం స్వీక‌రించాను. మీ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించి, అంద‌రికీ అండ‌గా నిలిచి రుణం తీర్చుకుంటాను" అంటూ పేరుపేరునా కృతజ్ఞతలుతెలిపారు.

అల్లూరులో లోకేశ్ యువగళానికి అపూర్వ స్పందన

యువగళం పాదయాత్రకు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం అల్లూరులో విశేష స్పందన లభించింది. భారీ ఎత్తున ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు రోడ్లపైకి తరలివచ్చి లోకేశ్ అపూర్వ స్వాగతం పలికారు. అల్లూరులో శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో లోకేశ్ ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఇవాళ అల్లూరు నుంచి ప్రారంభమైన పాదయాత్ర ఇస్కపల్లి తూము, ఉడిపిగుంట, సింగారెడ్డి దిన్నె, ఊదూరుగుంట, ఎర్రప్పగుంట, ఇస్కపల్లి, పాతపాలెం, తాటిచెట్లపాలెం మీదుగా బంగారుపాలెం క్యాంప్ సైట్ కు చేరుకుంది. 

జగన్ ఉప్పు రైతులను కోలుకోని దెబ్బతీశాడు!

జగన్ పాలనలో ఉప్పు రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచి ఉప్పు రైతులను కోలుకోలేని దెబ్బతీశాడని నారా లోకేశ్ విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో మాదిరిగా రాయితీపై విద్యుత్ అందిస్తామని, జగన్ పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని లోకేశ్ ఉప్పు రైతులకు భరోసా ఇచ్చారు. కావలి నియోజకవర్గంలో ఇస్కపాలెంలో ఉప్పు రైతులతో నారా లోకేశ్ సమావేశం నిర్వహించారు.

ఉప్పు సాగు రైతులు మాట్లాడుతూ...

జగన్ పరిపాలన వచ్చిన తరువాత ఉప్పు సాగు చేస్తున్న రైతులకి కనీస సాయం అందడం లేదని వాపోయారు. విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచి ఉప్పు రైతులను జగన్ ప్రభుత్వం దోచుకుంటోందని మండిపడ్డారు. పండించిన ప్రతి పంటకు క్రాప్ ఇన్స్యూరెన్స్ ఉందని, కానీ ఉప్పుకి మాత్రం ఇన్స్యూరెన్స్ లేదని విచారం వ్యక్తం చేశారు. 

వర్షాలు, వరదలు వచ్చనప్పుడు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని... ఉప్పు నిల్వ చేసుకోవడానికి షెడ్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. పండించిన ఉప్పు తీసుకువెళ్ళడానికి రోడ్లు లేవని వెల్లడించారు. ఎన్నో ఏళ్లుగా ఉప్పు సాగు చేసుకుంటున్నామని, తమకు పట్టాలు ఇప్పించాలని వారు లోకేశ్ కు విజ్ఞప్తి చేశారు.

లోకేశ్ సానుకూల స్పందన 

టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉప్పు రైతులు పొలాల వద్దే నిల్వ చేసుకునే విధంగా షెడ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. వరదలు, వర్షాలు వచ్చి ఉప్పు రైతులు నష్టపోయినప్పుడు ఇన్స్యూరెన్స్ కల్పించే అంశంపై నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని లోకేశ్ స్పష్టం చేశారు.

 ఉప్పు పండించే ప్రాంతాల్లో రోడ్లు, మౌలిక వసతులు కల్పిస్తామని, ఇతర రైతులకు ఇచ్చిన్నట్టే ఉప్పు రైతులకు కూడా అన్ని సబ్సిడీలు అందిస్తామని భరోసా ఇచ్చారు. ట్రాక్టర్లు, ఇతర పనిముట్లు అందిస్తాని తెలిపారు.

ఉప్పురైతులకు పట్టాలిచ్చే అంశాన్ని పరిశీలిస్తాం!

150వ రోజు ఉప్పు రైతులతో సమావేశం పెట్టుకోవడం నాకు సంతోషంగా ఉంది. ఉప్పు లేనిదే కూర రుచి ఉండదు. ఉప్పు సత్యాగ్రహం చేసినప్పుడు గాంధీ గారు ఈ ప్రాంతానికి వచ్చారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తక్కువ ధరకే ఉప్పు రైతులకి విద్యుత్ అందజేశారు. 

నేను పంచాయతీ రాజ్ మంత్రిగా ఉన్నప్పుడు ఉప్పు సాగు చేసే పొలాలకు రోడ్లు కూడా వేశాం. ఉప్పు సాగు రైతులకు పట్టాలు ఇచ్చే అంశం పై పార్టీలో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. కేంద్ర ప్రభుత్వానికి చెందిన భూమి కూడా ఉందని చెబుతున్నారు. దీనిపై పూర్తి వివరాలు తీసుకొని స్పందిస్తా.

*యువగళం పాదయాత్ర వివరాలు*

*ఇప్పటి వరకు నడిచిన మొత్తం దూరం – 1968.9 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం – 18.6 కి.మీ.*

*151వ రోజు పాదయాత్ర వివరాలు (9-7-2023):*

*కావలి అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్ పిఎస్ఆర్ నెల్లూరు జిల్లా)*

మధ్యాహ్నం

2.00 – బంగారుపాలెం క్యాంప్ సైట్ లో బిసిలతో ముఖాముఖి.

సాయంత్రం

4.00 – బంగారుపాలెం నుంచి పాదయాత్ర ప్రారంభం.

4.45 – వడ్డిపాలెంలో గ్రామస్తులతో సమావేశం.

5.45 – జువ్వలదిన్నెలో అమరజీవి పొట్టిశ్రీరాములు గృహం సందర్శన.

6.15 – చిప్పలేరు బ్రిడ్జి వద్ద స్థానికులతో మాటామంతీ.

6.45 – ఆదినారాయణపురంలో స్థానికులతో సమావేశం.

7.15 – అన్నగారిపాలెంలో స్థానికులతో సమావేశం.

7.45 – ఒట్టూరు క్రాస్ వద్ద స్థానికులతో సమావేశం.

9.15 – నడింపల్లి క్రాస్ వద్ద స్థానికులతో సమావేశం.

9.45 – మామిళ్లదరువులో స్థానికులతో సమావేశం.

10.30 – పువ్వులదరువులో స్థానికులతో సమావేశం.

10.40 – చిననట్టు-పెదనట్టు క్రాస్ వద్ద స్థానికులతో సమావేశం.

10.55 – తుమ్మలపెంట విడిది కేంద్రంలో బస.

******

More Telugu News