Hyderabad: పంజాగుట్ట ప్రాంతంలో రాకేశ్ మాస్టర్ భార్యపై మహిళల దాడి

  • లల్లీ అనే యూట్యూబర్, మరో నలుగురు మహిళలు కలిసి రాకేశ్ మాసర్ట్ భార్య లక్ష్మిపై దాడి
  • ఇరు వర్గాలు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు
  • నెల్లూరుకు చెందిన భారతి లల్లీకి డబ్బులిచ్చి తనపై ఉసిగొల్పిందన్న లక్ష్మి
  • లక్ష్మి వాదనలు ఖండించిన లల్లీ
  • యూట్యూబ్‌లో ఇష్టారీతిన తన కూతురిపై విమర్శలు చేసినందుకే కొట్టామని వెల్లడి
Rakesh master wife attacked in panjagutta

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ మూడో భార్యగా చెప్పుకునే లక్ష్మిపై కొందరు మహిళలు తాజాగా దాడి చేశారు. హైదరాబాద్‌లోని పంజాగుట్ట ప్రాంతంలో అయిదుగురు మహిళలు ఒక్కసారిగా వచ్చి ఆమెపై దాడికి దిగారు. లక్ష్మి తన స్కూటర్‌పై వెళుతుండగా లల్లీ అనే యూట్యూబర్ మరో నలుగురు మహిళలతో వచ్చి ఈ దాడి చేసినట్టు తెలుస్తోంది. లక్ష్మిని జుట్టుపట్టుకుని ఇష్టమొచ్చినట్టుగా కొడుతూ నానా హంగామా సృష్టించారు. 

స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లక్ష్మిని స్టేషన్‌కు తరలించారు. తనపై దాడి చేసిన వారిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తరువాత లల్లీ, ఆ నలుగురు మహిళలతో పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. తొలుత లక్ష్మియే తమను దూషించిందంటూ సాక్ష్యాధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరి ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు వాళ్లను పంపించేశారు. యూట్యూబ్ ఛానల్స్ నడుపుతున్న వీళ్లందరి మధ్య ఏదో విషయంలో గొడవ జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. 

అయితే, నెల్లూరుకు చెందిన భారతే ఇదంతా చేసిందని లక్ష్మి ఆరోపించింది. తనకు రెండు నెలలుగా చంపుతానంటూ బెదిరింపులు వస్తున్నాయని తెలిపింది. లల్లీకి భారతి డబ్బులు ఇచ్చి తనపై ఉసిగొల్పిందని పేర్కొంది. తన యూట్యూబ్ ఛానల్ మూసుకోవాలని వీరు బెదిరిస్తున్నారని ఆరోపించింది. కాగా, తనకు లక్ష్మితో ఎటువంటి వివాదాలు లేవని లల్లీ స్పష్టం చేసింది. తన కూతురిపై లక్ష్మి యూట్యూబ్ ఛానల్‌లో ఇష్టారీతిన నోరుపారేసుకుంటుండటంతో ఆమెపై దాడి చేయాల్సి వచ్చిందని వెల్లడించింది. రాకేశ్ మాస్టర్ ఇటీవలే అకస్మాత్తుగా అనారోగ్యం పాలై మృతి చెందిన విషయం తెలిసిందే.

More Telugu News