rajaiah: కడియం శ్రీహరీ... తస్మాత్ జాగ్రత్త!: హెచ్చరించిన ఎమ్మెల్యే రాజయ్య

  • కడియం దేవాదుల సృష్టికర్త కాదు... ఎన్‌కౌంటర్ల సృష్టికర్త అని ఆరోపణ
  • ఎంతోమంది నియోజకవర్గ బిడ్డలను పొట్టన పెట్టుకున్నాడని మండిపాటు
  • కడియంను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్
  • నేను ప్రతి ఇంటికి వెళ్లి డప్పు కొడతా... నువ్వు కొడతావా? అని నిలదీత
MLA Rajaiah warns Kadiyam Srihari

ఎమ్మెల్సీ కడియం శ్రీహరిపై స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం తాటికొండ గ్రామంలో ఆదిజాంబవ విగ్రహ ప్రతిష్ట భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కడియం దేవాదుల సృష్టికర్త కాదని, ఎన్‌కౌంటర్ల సృష్టికర్త అని ఆరోపించారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగినన్ని ఎన్‌కౌంటర్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా జరగలేదన్నారు. ఎంతోమంది నియోజకవర్గ బిడ్డలను పొట్టన పెట్టుకున్నాడని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. 

టీడీపీ హయాంలో ధర్మపురం సర్పంచ్ జన్మభూమి కార్యక్రమం నిర్వహించడం లేదని, జాఫర్ గడ్ తీసుకెళ్లి ఎన్ కౌంటర్ చేస్తానని కొడితే ఆయన ఇప్పటికీ కాళ్ల నొప్పులతో బాధపడుతున్నాడన్నారు. తాజాగా కొత్తపల్లి గ్రామానికి చెందిన సోమిరెడ్డి అనే రైతు భూవివాదంలో కలుగజేసుకొని ఆయనను పోలీసుల సాయంతో ఇబ్బంది పెట్టారన్నారు. ఆయన వల్ల నియోజకవర్గంలో కక్ష సాధింపులు మొదలయ్యాయని, వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

నియోజకవర్గంలో పార్టీ నిధులతో దొంగచాటుగా సమావేశాలు నిర్వహించి ప్రొసీడింగ్ కాపీలు అందించడం సరికాదన్నారు. కడియం శ్రీహరీ! తస్మాత్ జాగ్రత్త... నీతో తిరిగేవారంతా బీఆర్ఎస్ నుండి బహిష్కరించబడినవారే అన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తే, ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పిన కడియం, ఆ తర్వాత టీడీపీ నుండి తనే మొదట నామినేషన్ వేశాడన్నారు.

ఇక నుండి రోజూ గ్రామాలకు వెళతాను, ఇంటింటికి వెళతాను, ప్రతి గ్రామంలో డప్పు కొడతాను... నువ్వు కొడతావా... తిరుగుతావా? అని ప్రశ్నించారు. కడియం రాజకీయ జీవితంలో ఒక్కరోజన్నా పల్లెనిద్ర చేయలేదన్నారు. దొంగ వీడియోలు, ఆడియోలతో బెదిరేది లేదని, కోర్టుకు వెళ్లి ఎదుర్కొంటానన్నారు.

More Telugu News