Visakhapatnam: విశాఖలో రూ. 90 లక్షల విలువైన రూ. 2వేల నోట్లతో పట్టుబడిన వ్యక్తి.. అతడి నుంచి రూ. 12 లక్షలు తీసుకున్న మహిళా సీఐపై ఎఫ్ఐఆర్

  • విశాఖపట్టణంలోని సీతమ్మధారలో ఘటన
  • విచారణలో సీఐ డబ్బులు తీసుకున్నట్టు నిర్ధారణ
  • మహిళా సీఐ సహా నలుగురిపై కేసు నమోదు
Case Filed Against Visakha AR Inspector Swarnalatha

విశాఖపట్టణంలో రూ. 90 లక్షల విలువైన రూ. 2 వేల నోట్లతో పట్టుబడిన వ్యక్తిని బెదిరించి రూ. 12 లక్షలు లాక్కున్న ఏఆర్ ఇన్‌స్పెక్టర్ స్వర్ణలతతోపాటు మరో ముగ్గురిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సీతమ్మధార ప్రాంతంలో రాత్రిపూట విధుల్లో ఉన్న స్వర్ణలత బృందానికి సూరిబాబు అనే వ్యక్తి రూ. 90 లక్షల విలువైన రూ. 2 వేల నోట్లు తీసుకెళ్తూ దొరికాడు.

సూరిబాబును బెదిరించిన సీఐ అతడి నుంచి రూ. 12 లక్షల విలువైన నోట్లు తీసుకుని విడిచిపెట్టారు. ఈ ఘటనపై నౌకాదళ సిబ్బంది కొల్లి శ్రీను, శ్రీధర్ కలిసి విశాఖ నగర సీపీ త్రివిక్రమవర్మకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో స్వర్ణలత డబ్బులు తీసుకున్నట్టు తేలింది. దీంతో ఆమెతోపాటు శ్యాంసుందర్ అలియాస్ మెహర్, శ్రీనుపైనా వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నోట్ల మార్పిడికి మధ్యవర్తిగా వ్యవహరించిన సూరిబాబుపైనా కేసు నమోదు చేశారు.

More Telugu News