Etela Rajender: తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఈటల రాజేందర్ ఆగ్రహం

  • బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని దుష్ప్రచారం చేస్తున్నారన్న ఈటల 
  • 2019 నుండి గెలిస్తే బీజేపీ లేదా అధికార బలంతో బీఆర్ఎస్ గెలిచాయని వెల్లడి 
  • కాంగ్రెస్ ఎక్కడా గెలవలేదని వ్యాఖ్య
Etala Rajender fires for misleading people

తెలంగాణలో ఈ మధ్యకాలంలో తమ పార్టీపై కొంతమంది విషంకక్కే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గురువారం మండిపడ్డారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. తమపై అసహనంతో ఈ వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. వరంగల్ లో జులై 8న ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభ నేపథ్యంలో హన్మకొండలో ఈటల మీడియాతో మాట్లాడుతూ.. ఈ సభను విజయవంతం చేయాలన్నారు. తెలంగాణలో బీజేపీ చాలా బలంగా ఉందన్నారు. చాపకింద నీరులా పార్టీ విస్తరిస్తోందన్నారు. టక్కున పైకి వెళ్లడానికి బీజేపీ బలమేమీ సెన్సెక్స్ కాదన్నారు.

బీఆర్ఎస్ పార్టీతో మూడున్నరేళ్లుగా బరిగీసి, కొట్లాడిన పార్టీ బీజేపీ మాత్రమే అన్నారు. తెలంగాణ గడ్డపై తమ విజయపరంపర 2019లో ప్రారంభమైందని, ఆ తర్వాత దుబ్బాక, హుజూరాబాద్, జీహెచ్ఎంసీ, మునుగోడులో నైతిక విజయం, కరీంనగర్, వరంగల్ కార్పోరేషన్లలో గెలుపు, ఇటీవల ఉపాధ్యాయ ఎన్నికల్లో గెలుపు... వరుసగా గెలుస్తున్నామన్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో గెలిచింది బీజేపీ లేదా అధికార, డబ్బు బలంతో బీఆర్ఎస్ మాత్రమేనని, కాంగ్రెస్ ఎక్కడా గెలవలేదన్నారు. కానీ మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఇంతగా చెబుతుంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్, పత్రికలు, టీవీ ఛానల్స్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు.

తెలంగాణలో గెలుపే లక్ష్యంగా అధిష్ఠానం ముందుకు సాగుతోందన్నారు. కేసీఆర్ కుటుంబ పాలనను ఎట్టి పరిస్థితుల్లోను వదిలేది లేదని, ఆయన దోపిడీని ఊరుకునేది లేదని ప్రధాని మోదీ స్పష్టంగా చెప్పారన్నారు. తెలంగాణలో బీజేపీకి ఓటు వేస్తే మాత్రమే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ప్రాంతీయ పార్టీలకు ఓటు వేస్తే అక్రమార్జన, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అన్నారు.

More Telugu News