new cjs: తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త సీజేలు

  • తెలంగాణకు జస్టిస్ అలోక్ అరదే..
  • ఆంధ్రప్రదేశ్ కు జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్
  • మొత్తం ఏడు రాష్ట్రాలకు కొత్త సీజేలను ప్రతిపాదించిన కొలీజియం
Supreme Court Collegium proposes new Chief Justices for seven High Courts

తెలుగు రాష్ట్రాలతో పాటు ఏడు రాష్ట్రాల హైకోర్టులకు సుప్రీంకోర్టు కొలీజియం కొత్త ప్రధాన న్యాయమూర్తుల పేర్లను సిఫార్సు చేసింది. ఈమేరకు బుధవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలిజీయం ఓ తీర్మానాన్ని పాస్ చేసింది. ఈ తీర్మానం కాపీని బుధవారం రాత్రి సుప్రీంకోర్టు అధికారిక వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, ఒడిశా, మణిపూర్, బాంబే, గుజరాత్ హైకోర్టులకు చీఫ్ జస్టిస్ ల పేర్లను కొలీజియం ప్రతిపాదించింది. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ అరదే, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ధీరజ్ సింగ్ ఠాకూర్‌ను కొలీజియం సిఫార్సు చేసింది. 

జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్..
జమ్మూకశ్మీర్‌కు చెందిన జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ 1964 ఏప్రిలో 25న జన్మించారు. 1989లో ఢిల్లీ బార్ కౌన్సిల్ తో పాటు జమ్మూ కశ్మీర్ బార్ కౌన్సిల్ లో అడ్వొకేట్ గా పేరు నమోదు చేసుకున్నారు. 2013 లో జమ్మూ కశ్మీర్ హైకోర్టులో శాశ్వత జడ్జిగా నియమితులయ్యారు. 2022 జూన్‌ నుంచి బాంబే హైకోర్టు జడ్జిగా కొనసాగుతున్నారు.  

జస్టిస్ అలోక్ అరాదె..
జస్టిస్ అలోక్ అరాదె ఛత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ లో 1964 ఏప్రిల్ 13న జన్మించారు. బీఎస్సీ, ఎల్ఎల్ బీ పూర్తిచేసి 1988 లో మధ్యప్రదేశ్ బార్ కౌన్సిల్ లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. 2009లో మధ్యప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2011లో శాశ్వత జడ్జిగా నియమితులయ్యారు. అనంతరం 2016లో జమ్మూ కశ్మీర్ కోర్టుకు బదిలీ అయ్యారు. ఆపై 2018లో కర్ణాటక హైకోర్టుకు బదిలీపై వెళ్లారు. గతేడాది జులై 3 నుంచి కర్ణాటక హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు.

ఏ రాష్ట్రానికి ఎవరు..
గుజరాత్ హైకోర్టు.. జస్టిస్ సునీత అగర్వాల్. ప్రస్తుతం జస్టిస్ సునీత అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్నారు.
ఒడిశా హైకోర్టు.. జస్టిస్ సుభాషిస్ తాలపత్ర. ప్రస్తుతం ఒడిశా హైకోర్టులో న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు.
కేరళ హైకోర్టు.. జస్టిస్ ఆశిష్ జె దేశాయ్. ప్రస్తుతం గుజరాత్ హైకోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు.
మణిపూర్ హైకోర్టు.. జస్టిస్ సిద్ధార్థ్ మృదుల్. ప్రస్తుతం జస్టిస్ సిద్ధార్థ్ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. ప్రస్తుతం బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు. 
తెలంగాణ హైకోర్టు.. జస్టిస్ అలోక్ అరాదె. ప్రస్తుతం ఆయన కర్ణాటక హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలందిస్తున్నారు.
బాంబే హైకోర్టు.. జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ. ప్రస్తుతం అలహాబాద్ హైకోర్టులో జడ్జిగా వ్యవహరిస్తున్నారు.

More Telugu News