Ajit Pawar: తిరుగుబాటుకు ముందే శరద్ పవార్‌ను తొలగించాం: అజిత్ పవార్

  • ఆ సమావేశం గురించి ఎవరికీ తెలియదన్న శరద్ పవార్
  • తీర్మానాన్ని ఎన్నికల సంఘానికి పంపిన అజిత్ వర్గం
  • తనకు సీఎం కావాలని ఉందన్న అజిత్ పవార్
Removed Sharad Pawar As NCP National Chief Says Ajit Pawar

శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీని చీల్చిన అజిత్ పవార్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. శరద్ పవార్‌ను ఎన్సీపీ జాతీయ అధ్యక్ష పదవి నుంచి ఎప్పుడో తొలగించామని, ఆయన స్థానంలో తనను చీఫ్‌గా ఎన్నుకున్నారని పేర్కొన్నారు. శరద్, అజిత్ పవార్ వర్గాలు నిన్న తమ బలాలు నిరూపించుకునేందుకు పోటాపోటీ సమాశాలు నిర్వహించాయి. జూన్ 30న జరిగిన ఎగ్జిక్యూటివ్ సమావేశంలో శరద్ పవార్ స్థానంలో పార్టీ జాతీయ అధ్యక్షుడిగా అజిత్  పవార్‌ను ఎన్నుకుంటూ తీర్మానం జరిగినట్టు ఎన్నికల సంఘానికి నిన్న సమర్పించిన పిటిషన్‌లో అజిత్ వర్గం పేర్కొంది.
 
అజిత్ వ్యాఖ్యలను శరద్ పవార్ ఖండించారు. జూన్ 30న మీటింగ్‌ జరిగినట్టు అజిత్ పవార్ చెబుతున్నప్పటికీ ఆ సమావేశంలో పీసీ చాకో, సుప్రియా సూలే, జయంత్ పాటిల్, ఫౌజియా ఖాన్ తదితర వర్కింగ్ కమిటీ సభ్యులు లేరని, అసలు ఆ సమావేశం గురించి వారికి తెలియదని పేర్కొన్నారు. 

ఈ నెల 3న జయంత్ పాటిల్ నుంచి ఎన్నికల సంఘం ఓ ఈమెయిల్‌ను అందుకుంది. శివసేన-బీజేపీ ప్రభుత్వంలో చేరిన ఆ 9 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని జయంత్ పాటిల్ అందులో కోరారు. మరోవైపు, తనకు సీఎం కావాలని ఉందని బాంద్రాలో జరిగిన తన వర్గం ఎమ్మెల్యేల సమావేశంలో అజిత్ పవార్ పేర్కొన్నారు. తాను రికార్డు స్థాయిలో ఐదుసార్లు ఉప ముఖ్యమంత్రిని అయ్యానని, కానీ బండి అక్కడే ఆగిపోయిందన్నారు. తాను ఈ రాష్ట్రానికి ప్రముఖ్ (సీఎం)ను కావాలని అనుకుంటున్నట్టు మనసులో మాట బయటపెట్టారు.

More Telugu News