Tollywood: అభిమానులకు సారీ చెప్పిన హీరో నిఖిల్ సిద్దార్థ.. కారణం ఇదే!

  • ఇటీవల ‘స్పై’తో ఆకట్టుకోలేకపోయిన యువ హీరో
  • పలు భాషల్లో సమయానికి రిలీజ్ కాని చిత్రం
  • అందుకు క్షమాపణలు కోరిన నటుడు
  • ఇకపై నాణ్యత విషయంలో రాజీ పడబోనన్న నిఖిల్ 
Hero Nikhil Siddhartha apologies to audience

కార్తికేయ2తో ప్యాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ సిద్దార్థ ఇటీవల 'స్పై' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. పలు భాషల్లో సమయానికి రిలీజ్ కూడా కాలేకపోయింది. దీనిపై స్పందించిన నిఖిల్ అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకుంటానని తెలిపాడు. ఈ మేరకు ట్విట్టర్ లో సందేశం ఇచ్చాడు.

‘స్పై చిత్రం కోసం థియేటర్లకు వచ్చి, నా కెరీర్లోనే అత్యధిక  ఓపెనింగ్స్ ని అందించినందుకు మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాపై మీకు ఎంత నమ్మకం ఉందో తెలుసుకోవడం నాకు ఎనలేని ఆనందాన్ని కలిగిస్తోంది. కానీ, కాంట్రాక్ట్/కంటెంట్ జాప్య సమస్యల కారణంగా ఈ చిత్రాన్ని భారతదేశం అంతటా వివిధ భాషల్లో సరిగ్గా విడుదల చేయలేకపోయామని మీ అందరికీ తెలియజేయడం నాకు చాలా బాధ కలిగిస్తోంది. ఈ కారణంగానే విదేశాల్లో 350 తెలుగు ప్రీమియర్ షోలు కూడా రద్దయ్యాయి. దీనికి నేను హిందీ, కన్నడ, తమిళ, మలయాళ ప్రేక్షకులందరికీ క్షమాపణలు చెబుతున్నాను. కార్తికేయ2 తర్వాత మా తదుపరి రాబోయే 3 చిత్రాలు అన్ని భాషల్లో థియేటర్లలో పక్కాగా అనుకున్న సమయానికి విడుదల అవుతాయని మాటిస్తున్నా. ఇకపై నాణ్యత విషయంలో ఎప్పటికీ రాజీ పడబోనని నాపై నమ్మకం ఉంచే ప్రతి తెలుగు సినిమా ప్రేమికుడికి నేను మాటిస్తున్నా. ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినా అంతా పూర్తి చేసి, క్వాలిటీ చెక్ చేసి, అద్భుతమైన ప్రొడక్ట్ ను ముందుకు తెస్తాము’ అని నిఖిల్ పేర్కొన్నాడు.

More Telugu News