gas leak: ఏపీలోని ప్రకాశం జిల్లాలో విష వాయువు లీక్.. 16 మంది కార్మికులకు అస్వస్థత

  • మున్నంగి సీ ఫుడ్స్ లో అమ్మోనియం వాయువు లీక్
  • చేపల ప్రాసెసింగ్ సమయంలో ఘటన
  • స్పృహ కోల్పోయిన 16 మంది ఒరిస్సా కార్మికులు
  • ఒంగోలు రిమ్స్ లో వారికి చికిత్స అందిస్తున్న వైద్యులు
Ammonia gas leak in munnangi seafoods factory in Prakasham District

ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో విష వాయువు లీక్ కావడం భయాందోళనలు సృష్టించింది. వావిలేటిపాడులోని మున్నంగి సీ ఫుడ్స్ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చేపల ప్రాసెసింగ్ సమయంలో అమ్మోనియం వాయువు లీక్ అయింది. ఈ వాయువు పీల్చి అక్కడ పనిచేస్తున్న కార్మికుల్లో 16 మంది అస్వస్థతకు గురయ్యారు. వారంతా అపస్మారక స్థితిలోకి వెళ్లారని, వారిని వెంటనే ఆసుపత్రికి తరలించామని ఫ్యాక్టరీ ప్రతినిధి తెలిపారు.

కార్మికులకు మెరుగైన వైద్యం అందించేందుకు ఒంగోలు లోని రిమ్స్ లో చేర్పించినట్లు పేర్కొన్నారు. బాధిత కార్మికులంతా ఒరిస్సాకు చెందిన వారేనని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కార్మికుల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే వివరాలు కూడా తెలియరాలేదు.. అయితే, బాధితులు అందరినీ ఎమర్జెన్సీ వార్డులో చేర్చి, చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.

More Telugu News