Kishan Reddy: కేంద్ర కేబినెట్ సమావేశానికి కిషన్ రెడ్డి గైర్హాజరు.. రాజీనామా చేసినట్టు ఢిల్లీలో ప్రచారం

  • ఉదయం 9.30 గంటల నుంచి మోదీ నివాసంలో జరుగుతున్న కేబినెట్ సమావేశం
  • నివాసం నుంచి ఇప్పటి వరకు బయటకు రాని కిషన్ రెడ్డి
  • కిషన్ రెడ్డిని నిన్న తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించిన హైకమాండ్
Kishan Reddy not attended union cabinet meeting

ఢిల్లీలో జరుగుతున్న కేంద్ర కేబినెట్ సమావేశానికి కిషన్ రెడ్డి గైర్హాజరయ్యారు. ఉదయం 9.30 గంటల నుంచి ప్రధాని మోదీ నివాసంలో ఈ సమావేశం జరుగుతోంది. మరోవైపు, కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసినట్టు ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది. రాష్ట్రపతి నిన్నటి హైదరాబాద్ పర్యటన అనంతరం రాత్రికి ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. అయితే ఒకవైపు కేబినెట్ సమావేశం జరుగుతున్నప్పటికీ... ఆయన ఇప్పటి వరకు తన నివాసం నుంచి బయటకు రాలేదు. కిషన్ రెడ్డి శాఖకు చెందిన అధికారులు కూడా ఇప్పటి వరకు ఆయన నివాసానికి రాలేదు.

కిషన్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నిన్న నియమించిన సంగతి తెలిసిందే. ఆయన నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బీజేపీ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి ఏక కాలంలో రెండు పదవులను నిర్వహించే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలోనే మంత్రి పదవికి ఆయన రాజీనామా చేసినట్టు చెపుతున్నారు. ఈ సాయంత్రానికి మరికొందరు కేంద్ర మంత్రులు రాజీనామా చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కిషన్ రెడ్డి ఇకపై రాష్ట్ర కార్యకలాపాలకే పరిమితమయ్యే అవకాశం ఉంది.

More Telugu News