icc: ప్రపంచ కప్​ కోసం భారత్​ వచ్చేందుకు పాక్ ప్రధాని అనుమతి కోరిన పాక్ జట్టు

  • అక్టోబర్–నవంబర్ లో వరల్డ్ కప్‌కు భారత్ ఆతిథ్యం
  • హైదరాబాద్‌ లో తొలి రెండు మ్యాచ్‌ లు ఆడనున్న పాకిస్థాన్
  • జట్టు ప్రయాణానికి క్లియరెన్స్ ఇవ్వాలని ప్రధానికి లేఖ రాసిన పీసీబీ
PCB seeks clearance to travel to India for World Cup writes to Pak PM

భారత్ లో జరిగే వన్డే వరల్డ్‌ కప్‌ లో పాల్గొనేందుకు పాకిస్థాన్ అంగీకరించింది. వేదికల విషయంలో అసంతృప్తి వ్యక్తం చేసిన పాక్ చివరికి మనసు మార్చుకుంది. టోర్నీలో ఆడాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ మెగా టోర్నీ కోసం భారత్ వెళ్లేందుకు అనుమతి కోరుతూ ఆ దేశ ప్రభుత్వానికి పాకిస్థాన్ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) విజ్ఞప్తి చేసింది. పాకిస్థాన్ జట్టు ప్రయాణానికి క్లియరెన్స్‌ ఇవ్వాలని ఆ దేశ ప్రధాని షెహ్‌బాజ్‌ షరీఫ్‌, అంతర్గత, విదేశాంగ మంత్రులకు పాక్ బోర్డు లేఖలు రాసింది. పాకిస్థాన్ జట్టును భారత్ వెళ్లడానికి అనుమతించాలా? వద్దా?... భారత్ లో పాక్‌ ఆడే ఐదు వేదికలపై ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా? ఉంటే చెప్పాలని ఈ లేఖలో పీసీబీ కోరింది. 

ప్రపంచ కప్‌ షెడ్యూల్‌ వచ్చిన వెంటనే ఇంటర్-ప్రావిన్షియల్ కోఆర్డినేషన్ (ఐపీసీ) మంత్రిత్వ శాఖ ద్వారా ప్రధానికి లేఖ రాసినట్టు పీబీసీ వర్గాలు తెలిపాయి. ప్రపంచ కప్‌లో పాల్గొనేందుకు క్లియరెన్స్‌ ఇవ్వాలని కోరుతూ విదేశీ, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలకు కూడా ప్రతులు పంపించామని, వారి నుంచి సూచనల ప్రకారం తమ తదుపరి అడుగులు ఉంటాయని వెల్లడించాయి. కాగా, భారత్ వేదికగా అక్టోబర్–నవంబర్‌‌ లో జరిగే ప్రపంచ కప్ లో పాకిస్థాన్ ఐదు వేదికల్లో పోటీ పడనుంది. ముందుగా హైదరాబాద్ లో రెండు ప్రాక్టీస్ మ్యాచ్ లు, శ్రీలంక, మరో క్వాలిఫయర్ జట్టుతో తొలి రెండు లీగ్ మ్యాచ్‌ ల్లో పోటీ పడనుంది.

More Telugu News