yatra 2: ‘గుర్తుపెట్టుకోండి.. నేను వైఎస్‌ రాజశేఖరరెడ్డి కొడుకుని’.. ‘యాత్ర–2’పై అప్‌డేట్ ఇచ్చిన మేకర్స్!

  • జగన్ పాదయాత్ర ఆధారంగా యాత్ర–2
  • వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటన
  • దర్శకత్వం వహించనున్న మహి వి.రాఘవ్
yatra 2 movie release date out first look poster goes viral

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘యాత్ర’. వైఎస్ పాదయాత్రపై తీసిన ఈ చిత్రం నాలుగేళ్ల కిందట విడుదలైంది. అప్పట్లోనే ఈ చిత్రానికి సీక్వెల్‌ ఉంటుందని దర్శకుడు మహి వి.రాఘవ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో యాత్ర–2పై మేకర్స్ అప్‌డేట్‌ ఇచ్చారు.

వైఎస్‌ జగన్‌ పాదయాత్ర నుంచి మొదలై ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే దాకా యాత్ర–2 ఉంటుందని ఇటీవల దర్శకుడు వెల్లడించారు. జులై 8న వైఎస్సార్‌ జయంతి సందర్భంగా సినిమాపై ప్రకటన చేస్తారని అంతా భావించారు. కానీ వారం ముందే ‘యాత్ర-2’పై పోస్టర్ రిలీజ్ చేశారు. సినిమా రిలీజ్‌ గురించి కూడా వెల్లడించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

ఇక పోస్టర్‌‌లో ప్రజలకు అభివాదం చేస్తున్న చెయ్యి, అందులో జగన్‌ నీడ కనిపిస్తోంది. ‘‘నేనెవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలియకపోవచ్చు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి.. నేను వైఎస్‌ రాజశేఖరరెడ్డి కొడుకుని” అనే లైన్‌ పోస్టర్‌‌పై రాసుకొచ్చారు.

ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు. జగన్ పాత్ర పోషించేదెవరనేది ఇంకా ఖరారు కాలేదు. ‘యాత్ర’లో వైఎస్ పాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఒదిగిపోయారు. ఇప్పుడు ‘యాత్ర–2’లో ఎవరు నటిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

యాత్ర సినిమా 2019 ఎన్నికలకు కొన్ని రోజుల ముందు రిలీజైంది. ఇప్పుడు యాత్ర–2 కూడా 2024కు ముందే విడుదల చేయనున్నారు. మరోవైపు వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కూడా జగన్‌పై సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. వ్యూహం, శపథం పేరుతో రెండు సినిమాలు తెరకెక్కిస్తున్నారు.

More Telugu News