Hyderabad: టీఎస్ఆర్టీసీ బంపరాఫర్.. 10 శాతం రాయితీతో రూ.100 వరకు ఆదా

  • విజయవాడ, బెంగళూరు మార్గాల్లో ప్రయాణించేవారికి రాయితీ
  • జులై 2 నుండి ఆగస్ట్ 15 వరకు అందుబాటులో ఉంటుందని వెల్లడి
  • విజయవాడ రూట్లో రూ.50 వరకు, బెంగళూరు రూట్లో రూ.100 వరకు ఆదా అవుతుందని ట్వీట్
TSRTC offer to vijayawada and bengaluru travellers

దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. విజయవాడ, బెంగళూరు మార్గాల్లో వెళ్లే ప్రయాణికులకు టిక్కెట్‌పై పది శాతం రాయితీ కల్పించాలని నిర్ణయించింది. ఆ రెండు మార్గాల్లో రాకపోకలు సాగించేవారు ముందస్తు రిజర్వేషన్ చేసుకుంటే తిరుగు ప్రయాణంపై పది శాతం డిస్కౌంట్ ఇస్తారు. ఈ రాయితీ సేవలు జులై 2, ఆదివారం నుండి అందుబాటులోకి వస్తాయి. అయితే ఇది పరిమిత రాయితీ. ఆగస్ట్ 15 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్వీట్ చేశారు.

విజయవాడ, బెంగళూరు మార్గాల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, వారికి ఆర్థిక భారం తగ్గించాలనే ఉద్దేశంతోనే ముందస్తు రిజర్వేషన్ సదుపాయం ఉన్న అన్ని సర్వీసుల్లో 10% రాయితీ కల్పించాలని నిర్ణయించినట్లు టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి కూడా ట్వీట్ చేశారు. రానుపోను ఒకేసారి బుక్ చేసుకుంటే తిరుగు ప్రయాణంపై 10% రాయితీ ఉంటుందని, ఈ డిస్కౌంట్ వల్ల విజయవాడ రూట్లో రూ.50 వరకు, బెంగళూరు రూట్లో రూ.100 వరకు ఆదా అవుతుందని తెలిపింది.

More Telugu News