Aadhaar: ఆధార్ - పాన్ కార్డ్ లింక్ పై కీలక ప్రకటన చేసిన ఐటీ శాఖ

  • ఆధార్ - పార్ కార్డ్ లింక్ కు నిన్నటితో ముగిసిన గడువు
  • చాలా మందికి చలాన్ పేమెంట్, డాక్యుమెంట్ల లింకింగ్ లో తలెత్తిన సమస్యలు
  • చెల్లింపు పూర్తయిన వారు రెండింటినీ లింక్ చేసుకోవచ్చన్న ఐటీ శాఖ
IT dept announcement on Aadhar PAN linking

ఆధార్ ను పాన్ కార్డ్ తో లింక్ చేసుకోవడానికి నిన్నటితో గడువు ముగిసింది. అయితే నిన్న చివరి రోజు కావడంతో ఆధార్ ను లింక్ చేసుకోవడానికి ఆన్ లైన్ లో ప్రజలు పోటెత్తారు. దీంతో చాలా మందికి చలాన్ పేమెంట్, డాక్యుమెంట్ల లింకింగ్ లో సమస్యలు తలెత్తాయి. మరోవైపు ఆధార్, పాన్ కార్డ్ లింక్ కు డెడ్ లైన్ ను పెంచుతారని పలువురు భావించినప్పటికీ... ఐటీ శాఖ మాత్రం గడువును పెంచలేదు. అయితే ఐటీ శాఖ ఒక కీలక ప్రకటన చేసింది. 

చలాన్ డౌన్ లోడ్ చేసుకోవడంలో చాలా మంది ఇబ్బంది ఎదుర్కొన్నట్టు తమ దృష్టికి వచ్చిందని ఐటీ శాఖ తెలిపింది. చలాన్ కోసం చెల్లింపులు పూర్తి చేసిన వారు ఐటీ వెబ్ సైట్ లో లాగిన్ అయి... ఈ-పే ట్యాక్స్ సెక్షన్ లో చెల్లింపు పూర్తయిందా? లేదా? అనే విషయాన్ని తెలుసుకోవచ్చని సూచించింది. అందులో పేమెంట్ పూర్తయినట్టు చూపిస్తే... ఆధార్, పాన్ లింక్ చేసుకోవచ్చని తెలిపింది. 

చెల్లింపు పూర్తయిన వారి రిజిస్టర్డ్ ఈమెయిల్ కు చలాన్ కు సంబంధించిన రశీదు కాపీ వస్తుందని చెప్పింది. చెల్లింపు పూర్తయినప్పటికీ... ఆధార్, పాన్ లింక్ ప్రక్రియ పూర్తి కాకపోతే అలాంటి వాటిని ఐటీ శాఖ పరిగణనలోకి తీసుకుంటుందని తెలిపింది. ప్రత్యేకంగా చలాన్ ను డౌన్ లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పింది.

More Telugu News