satya nadella: క్యాండీ క్రష్ గురించి న్యాయమూర్తి ప్రశ్న.. సత్య నాదెళ్ల ఆసక్తికర సమాధానం

  • తాను క్యాండీ క్రష్ ఆటను ఆస్వాదిస్తానని చెప్పిన సత్య నాదెళ్ల
  • ఓ వీడియో గేమింగ్ కంపెనీ కొనుగోలు ట్రాన్సాక్షన్ కేసులో కోర్టుకు హాజరైన నాదెళ్ల
  • విచారణ సందర్భంగా న్యాయమూర్తి, సత్య నాదెళ్ల మధ్య ఆసక్తికర సంభాషణ
Microsoft CEO Satya Nadella joins the Candy Crush craze

క్యాండీ క్రష్ గేమ్ ను ప్రపంచవ్యాప్తంగా చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు ఎంతోమంది ఇష్టపడతారు. ఇటీవల మహేంద్ర సింగ్ ధోనీ విమానంలో ప్రయాణిస్తూ క్యాండీ క్రష్ ఆడుతూ కనిపించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీంతో ఈ గేమ్ ను మూడు గంటల్లోనే మూడున్నర లక్షలమంది డౌన్ లోడ్స్ చేసుకున్నారు. 

తాజాగా ఈ గేమ్ గురించి మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్యాండీ క్రష్ ఆటను తాను ఆస్వాదిస్తానని ఆయన చెప్పారు. యాక్టివిజన్ బ్లిజార్డ్ అనే వీడియో గేమింగ్ కంపెనీ కొనుగోలు ట్రాన్సాక్షన్స్ కు సంబంధించి నమోదైన కేసు విచారణలో భాగంగా ఫ్రాన్సిస్కో పెడరల్ కోర్టు ఎదుట ఆయన హాజరయ్యారు. విచారణలో భాగంగా న్యాయమూర్తికి, సత్య నాదెళ్లకు మధ్య కాసేపు సరదా సంభాషణ జరిగింది. 

ఈ సందర్భంగా, క్యాండీ క్రష్ గేమ్ గురించి మీ అభిప్రాయం ఏమిటని న్యాయమూర్తి అడిగారు. దానికి సత్య నాదెళ్ల సమాధానిస్తూ... తాను ఈ గేమ్ ను ఆస్వాదిస్తానని, దీంతో పాటు కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్ ఆడుతుంటానని చెప్పారు. దీంతో కోర్టు హాలులో ఉన్నవారంతా సరదాగా నవ్వారు. తనకు కన్ సోల్ గేమ్స్, పీసీ గేమ్స్ అంటే ఇష్టమని, ప్రత్యేకంగా మొబైల్ గేమ్స్ అంటే చాలా ఇష్టమని చెప్పారు.

More Telugu News