Kottu Sathyanarayana: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలతో ఆడపిల్లల తల్లిదండ్రులు భావోద్వేగాలకు గురవుతున్నారు: మంత్రి కొట్టు సత్యనారాయణ

  • వారాహి యాత్రలో వైసీపీ నేతలపై విరుచుకుపడుతున్న పవన్
  • పవన్ నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడన్న మంత్రి కొట్టు సత్యనారాయణ
  • 40 పెళ్లిళ్లు చేసుకోవాలని యువతకు సందేశం ఇస్తున్నాడని విమర్శలు
  • పవన్ యువతను రెచ్చగొడుతున్నాడని ఆగ్రహం
Minister Kottu Sathyanarayana take a dig at Pawan Kalyan

ఏపీ దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ జనసేనాని పవన్ కల్యాణ్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న పవన్ కల్యాణ్ మాట్లాడుతున్న తీరు చూస్తుంటే, మీరు 40 పెళ్లిళ్లు చేసుకోండంటూ యువతకు సందేశం ఇస్తున్నట్టుగా ఉందని అన్నారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలతో ఆడపిల్లల తల్లిదండ్రులు భావోద్వేగాలకు గురవుతున్నారని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.

పవన్ మాటలు యువతను రెచ్చగొట్టే తీరులో ఉన్నాయని విమర్శించారు. ఓ రాజకీయ పార్టీ అధినేత అంటే ఇలా ఉండకూడదని, పవన్ ముందు భాష, ఆలోచన తీరు మార్చుకోవాలని హితవు పలికారు. సీఎం జగన్ పై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని, నాయకుడు ఎప్పుడూ ఆదర్శంగా ఉండాలని మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. తమకు తొడలు కొట్టడం, మీసాలు తిప్పడం రాదని పవన్ చర్యలను ఎత్తిచూపారు. 

పవన్ ఏనాడైనా చంద్రబాబును విమర్శించాడా? అని ప్రశ్నించారు. కాపుల ద్రోహి చంద్రబాబును పవన్ నెత్తిన పెట్టుకుంటున్నాడని మంత్రి మండిపడ్డారు. పవన్ ను అసెంబ్లీకి పంపాలో, ఎక్కడికి పంపాలో ప్రజలే నిర్ణయిస్తారని వ్యాఖ్యానించారు.

More Telugu News