Tomato: భగ్గుమంటున్న టమాటా ధరలను నియంత్రించేందుకు రంగంలోకి ఏపీ ప్రభుత్వం

  • కిలో రూ.100కి పైనే పలుకుతున్న టమాటా
  • హడలిపోతున్న సామాన్యులు
  • రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు
  • కిలో రూ.50కి అందించేలా ప్రభుత్వం చర్యలు
  • రైతుల నుంచి నేరుగా కొనుగోలుకు ఏర్పాట్లు
Tomato prices raises high in AP

మొన్నటివరకు కిలో రూ.10కు కూడా లభించిన టమాటాలు ఇప్పుడు భగ్గుమంటున్నాయి. వాటి ధర కిలో రూ.100కి పైనే పలుకుతుండడంతో సామాన్యులు ఆచితూచి వాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

ఈ నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వం రంగంలోకి దిగింది. రాష్ట్రంలో ఒక్కసారిగా పెరిగిన టమాటాల ధరలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టింది. పలు జిల్లాల్లో టమాటా ధరలు కిలో రూ.100 నుంచి రూ.150 మధ్య పలుకుతుండడంతో, వినియోగదారులు ఇబ్బందులు పడుతుతున్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించింది. దాంతో, టమాటాలను తక్కువ ధరకే ప్రజలకు అందుబాటులోకి తెచ్చే బాధ్యతను మార్కెటింగ్ శాఖకు అప్పగించింది. 

టమాటాలను రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసి రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణ ప్రాంతాల్లోని రైతు బజార్లలో కిలో రూ.50కే విక్రయించేలా చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు. 

ప్రతి ఒక్కరికీ కిలో రూ.50 చొప్పున టమాటాలు విక్రయించేలా చూడాలని సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని సర్కారు పేర్కొంది.

More Telugu News