Bengaluru: ఆటో డ్రైవర్ కన్నీళ్లు..కనికరం చూపని నెటిజన్లు!

  • బెంగళూరు ఆటో డ్రైవర్ కన్నీళ్లు పెట్టుకుంటున్న వీడియో వైరల్
  • అయిదు గంటలు కష్టపడితే రూ.40 వచ్చిందని ఆటోవాలా ఆవేదన
  • వీడియోపై నెట్టింట భిన్నాభిప్రాయాలు
  • డ్రైవర్ బాధ చూసి జాలిపడని కొందరు నెటిజన్లు
  • కర్మ ఫలితం ఇదేనంటూ వ్యాఖ్యలు
Bengaluru auto driver in tears after earning Rs 40 in 5 hours

కర్ణాటక‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు సర్వీసు పథకం ఆటోవాలాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. కస్టమర్లు లేక, రోజంతా ఆటో తోలినా ఆశించిన డబ్బులు రాక ఆటోడ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు. అయిదు గంటల పాటు కష్టపడ్డాక రూ.40 కళ్లజూసిన ఓ బెంగళూరు ఆటోడ్రైవర్ ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. వీడియోలో, ఆటో డ్రైవర్ ఆ డబ్బులను చూపిస్తూ కన్నీళ్లు పెట్టుకోవడం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. 
 
ఆటో డ్రైవర్ దీనస్థితి చూసిన నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు అతడి పరిస్థితి చూసి ఆవేదన వ్యక్తం చేయగా మరికొందరు మాత్రం ‘‘చేసుకున్న వారికి చేసుకున్నంత’’ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ‘‘వీళ్ళపై జాలి చూపించకూడదు. గత వారం నేను జయదేవ నుంచి మల్లేశ్వరం వెళదామనుకున్నప్పుడు ఒక్క ఆటోవాలా కూడా రాలేదు. ఆటోలు పార్క్ చేసుకుని కూర్చున్నారే తప్ప ఒక్కరు ఆటో కట్టేందుకు ముందుకు రాలేదు. ఒక వ్యక్తి మాత్రం సాధారణ చార్జీతో పోలిస్తే ఏకంగా రెండు రెట్లు అడిగాడు’’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. 

ఆటో డ్రైవర్లు ఇష్టారీతిన కస్టమర్ల నుంచి డబ్బులు గుంజే వారని అనేక మంది కామెంట్ చేశారు. మీటర్ల ట్యాంపరింగ్, కొన్ని రూట్లలో రానని మొండికేయడం, అధిక ధరలు వసూలు చేయడం వంటివి చేస్తారని అన్నారు. ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తిస్తే వారు ఆటోలు ఎక్కేందుకు ముందుకు వస్తారని హితవు పలికారు. 


More Telugu News