KTR: ఈటల రాజేందర్ భద్రతపై డీజీపీకి ఫోన్ చేసిన కేటీఆర్

  • తనను హత్య చేసేందుకు కుట్రలు చేస్తున్నారన్న ఈటల
  • ఈటల భద్రతపై సీనియర్ ఐపీఎస్ తో వెరిఫై చేయించాలన్న కేటీఆర్
  • అవసరమైనంత సెక్యూరిటీని కల్పించాలని డీజీపీకి సూచన
KTR telephones DGP regarding Etela Rajender security

తనను హత్య చేసేందుకు కుట్రలు చేస్తున్నారంటూ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఆయన భద్రతపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఆయనకు కేంద్ర బలగాలతో వై కేటగిరీ భద్రతను ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. మరోవైపు ఈటల భద్రతపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. 

రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్ కు ఫోన్ చేసి ఈటల భద్రతపై కేటీఆర్ చర్చించారు. ఈటల భద్రతపై సీనియర్ ఐపీఎస్ అధికారితో వెరిఫై చేయించాలని సూచించారు. రాష్ట్ర పోలీసు బలగాలతో ఈటలకు అవసరమైనంత సెక్యూరిటీని కల్పించాలని చెప్పారు. కేటీఆర్ ఆదేశాల మేరకు ఈటల భద్రత పెంపుకు సంబంధించి ఈరోజు డీజీపీ సమీక్ష చేయనున్నారు. కాసేపట్లో ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి ఈటల నివాసానికి వెళ్లనున్నారు. తన భర్తకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డితో ప్రాణ హాని ఉందంటూ ఈటల భార్య కూడా సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

More Telugu News