Vande Bharat: టికెట్ లేకుండా వందేభారత్ ట్రైన్ ఎక్కిన యువకుడు ఏం చేశాడంటే..!

  • టాయిలెట్ లోకి వెళ్లి డోర్ వేసుకున్న యువకుడు
  • బయటకు రానంటూ గంటల తరబడి లోపలే ఉన్న వైనం
  • డోర్ పగలకొట్టి బయటకు తీసుకొచ్చిన అధికారులు
Kerala Man Shuts Self In Vande Bharat Washroom

టికెట్ తీసుకోకుండా రైలు ఎక్కిన వారు టీటీఈని చూసి టాయిలెట్ లో దాక్కోవడం చూసే ఉంటారు.. వందేభారత్ రైలులోనూ ఇలాంటి ఘటనే ఆదివారం చోటుచేసుకుంది. ట్రైన్ ఎక్కడంతోనే టాయిలెట్ లోకి వెళ్లి తలుపు బోల్ట్ పెట్టుకుని లోపలే కూర్చుండిపోయాడు ఓ యువకుడు. గంటల తరబడి బయటకు రాకపోవడంతో అధికారులు డోర్ పగలకొట్టి బయటకు తీసుకురావాల్సి వచ్చింది. కేరళలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు..

ఉత్తర కాసర్ గోడ్ జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం ఓ యువకుడు వందేభారత్ ట్రైన్ ఎక్కాడు. రైలు కదిలిన కాసేపటికే టాయిలెట్ లోకి వెళ్లాడు. ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో తోటి ప్రయాణికులు రైల్వే సిబ్బందికి ఫిర్యాదు చేశారు. సిబ్బంది వచ్చి బయటకు రమ్మంటూ పిలిచినా ఆ యువకుడు ససేమిరా రానన్నాడు. గంటలు గడిచినా డోర్ తీయకపోవడంతో ఆర్పీఎఫ్ సిబ్బంది చివరకు డోర్ పగలకొట్టి యువకుడిని బయటకు తీసుకొచ్చారు.

ఎరుపు రంగు టీ షర్ట్ ధరించిన ఆ యువకుడు భయంభయంగా చూస్తూ పొంతనలేని సమాధానాలు చెబుతున్నాడని అధికారులు వెల్లడించారు. కొంతమంది తనను తరుముకుంటూ రావడంతో భయపడి రైలు ఎక్కానని, వారి నుంచి తప్పించుకునేందుకు టాయిలెట్ లో దూరి గడియ పెట్టుకున్నానని చెబుతున్నాడని రైల్వే పోలీసులు తెలిపారు.

More Telugu News