Jagitial: ప్రియురాలికి పెళ్లయినా బంధం కొనసాగిస్తున్న యువకుడు.. పట్టపగలు దారుణ హత్య

  • ప్రియురాలికి రెండేళ్ల క్రితం వివాహం
  • ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకుంటూ, తరచూ కలుసుకుంటున్నారని అనుమానం
  • బైక్‌పై వస్తుండగా దాడిచేసి గొడ్డలితో నరికి చంపిన నిందితులు
Young Man Killed In Jagitial

ప్రేమించిన యువతికి రెండేళ్ల క్రితం వివాహమైనా ఆమెతో ఇప్పటికీ మాట్లాడుతున్న యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. జగిత్యాల జిల్లాలో పట్టపగలు జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. బీర్పూరుకు చెందిన జువ్వికింది వంశీ (23) తుంగూరులోని డ్రైవింగ్ స్కూల్‌లో పనిచేస్తున్నాడు. 

మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతిని ప్రేమించాడు. విషయం తెలిసిన యువతి కుటుంబ సభ్యులు ఆమెకు రెండేళ్ల క్రితం మరో వ్యక్తితో పెళ్లి చేశారు. అయితే, యువతికి పెళ్లయినప్పటికీ ఇద్దరూ తరచూ ఫోన్లో మాట్లాడుకుంటున్నారని, కలుసుకుంటున్నారని అనుమానించిన యువతి కుటుంబ సభ్యులు వంశీని పలుమార్లు హెచ్చరించారు. అయినప్పటికీ మారకపోవడంతో అతడి హత్యకు ప్లాన్ చేశారు. 

నిన్న కొల్వాయి నుంచి తుంగూరుకు బైక్‌పై వస్తున్న వంశీని అడ్డగించిన ఇద్దరు వ్యక్తులు గొడ్డలితో దాడి చేసి దారుణంగా హత్యచేశారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిందితులను తమకు అప్పగించాలంటూ బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆందోళనకు దిగారు. పోలీసు ఉన్నతాధికారులు గ్రామానికి చేరుకుని వారితో చర్చించారు. నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పి వారిని శాంతింపజేశారు. హతుడు వంశీ తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News