KCR: మహారాష్ట్రపై కేసీఆర్ ఫోకస్... రేపటి నుంచి రెండ్రోజుల టూర్

  • జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్
  • బీఆర్ఎస్ పార్టీని విస్తరించేందుకు ప్రణాళికలు
  • మహారాష్ట్రలో ఇప్పటికే నాలుగుసార్లు పర్యటించిన కేసీఆర్
  • ఈసారి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి వెళుతున్న వైనం
  • రోడ్డు మార్గంలో మహారాష్ట్ర వెళ్లి రానున్న కేసీఆర్
KCR will go to Maharashtra for two days tour

టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి జాతీయ రాజకీయాల్లో శంఖారావం పూరించిన తెలంగాణ సీఎం కేసీఆర్... పొరుగునే ఉన్న మహారాష్ట్రపై దృష్టి సారించారు. ఇప్పటికే నాలుగు పర్యాయాలు మహారాష్ట్రలో పర్యటించిన కేసీఆర్... మరోసారి పర్యటించేందుకు సిద్ధమయ్యారు. 

రేపటి నుంచి రెండ్రోజుల పాటు కేసీఆర్ మహారాష్ట్రలో పర్యటించనున్నారు. జూన్ 26 ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో మహారాష్ట్ర వెళ్లనున్నారు. రాత్రికి షోలాపూర్ లో బస చేస్తారు. షోలాపూర్ లో స్థానిక రాజకీయ నేత భగీరథ్ బాల్కే సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. అనంతరం మహారాష్ట్ర నేతలు, తెలంగాణ నుంచి వలస వెళ్లిన చేనేత కుటుంబాలతో కేసీఆర్ భేటీ కానున్నారు. 

ఈ నెల 27న ఉదయం పండరీపూర్ లో విఠోబా రుక్మిణీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత దారాశివ్ జిల్లాలోని తుల్జా భవానీ అమ్మవారి శక్తి పీఠాన్ని కూడా కేసీఆర్ సందర్శించనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. 

ఈసారి కేసీఆర్ చేపట్టే రెండ్రోజుల పర్యటనకు ఓ ప్రత్యేకత ఉంది. ఈసారి కేసీఆర్ వెంట మహారాష్ట్రకు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు భారీగా తరలి వెళ్లనున్నారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ ను విస్తరించడమే ప్రధాన లక్ష్యంగా కేసీఆర్ తన కార్యాచరణను ముందుకు తీసుకెళుతున్నారు.

More Telugu News