KCR: ఎన్నికలొస్తున్నాయ్.. మా సీట్లు తేల్చండి!: కేసీఆర్ వద్దకు త్వరలో లెఫ్ట్ పార్టీ నేతలు

  • కేసీఆర్ తో సీట్ల పంపకానికి సంబంధించి చర్చలు జరపాలని వామపక్ష పార్టీల నిర్ణయం
  • సీఎం కేసీఆర్ అపాయింట్‌మెంట్ కోరిన నేతలు
  • ఒకటి రెండు రోజుల్లో అపాయింట్‌మెంట్ ఖరారు చేసే అవకాశం
Left parties will meet cm kcr for seat sharing

తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో సీట్ల పంపకానికి సంబంధించి చర్చలు జరపాలని వామపక్షాల నేతలు నిర్ణయించారు. మూడు రోజుల క్రితం ముగ్దూం భవన్ లో సీపీఐ, సీపీఎం కార్యదర్శులు, ముఖ్యనేతలు సమావేశమై, బీఆర్ఎస్ తో చర్చలు జరపాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ క్రమంలో వారు సీఎం కేసీఆర్ అపాయింట్‌మెంట్ కోరారు. ఒకటి రెండు రోజుల్లో అపాయింట్‌మెంట్ ఖరారు చేస్తామని ముఖ్యమంత్రి కార్యాలయం సమాచారం ఇచ్చింది. అపాయింట్‌మెంట్ ఖరారయ్యాక వామపక్షాల నేతలు... ముఖ్యమంత్రితో సమావేశం కానున్నారు.

కేసీఆర్ తో భేటీ అయ్యేవారిలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం భేటీ కానున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీలకు కేటాయించే సీట్ల విషయంలో స్పష్టతను తీసుకోనున్నారు. ఎన్నికలకు మరో ఆరు నెలల గడువు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో సీట్ల విషయాన్ని త్వరగా తేల్చాలని వామపక్షాలు ఒత్తిడి తెస్తున్నాయి. ఆలస్యం చేస్తే తాము నష్టపోతామని భావిస్తున్నాయి.

More Telugu News