Sharmila: గల్లీలో సిగపట్లు, ఢిల్లీలో కౌగిలింతలు.. ఇంకా మీ నాటకాలు దేనికి?: బీజేపీ, బీఆర్ఎస్‌పై షర్మిల మండిపాటు

  • ఆ రెండు పార్టీల అక్రమ స్నేహం ఎంత దాచినా దాగదన్న షర్మిల
  • బలమైన సాక్ష్యాలున్నా కవితను సీబీఐ ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్న
  • ఆమె కడిగిన ముత్యమా, లేక మీది కుదిరిన బంధమా? అని సెటైర్
sharmila fires on BJP and BRS

బీఆర్ఎస్, బీజేపీపై వైఎస్సార్‌‌టీపీ చీఫ్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ఆ రెండు పార్టీల అక్రమ స్నేహం ఎంత దాచినా దాగదని మండిపడ్డారు. ఇంకా నాటకాలు ఎందుకంటూ నిలదీశారు. ఈ రోజు  ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు.

‘‘కుళ్లు కాయలను బంగారు సంచిలో దాచినా కంపు బయటపడదా ఏంటి? బీఆర్ఎస్, బీజేపీ అక్రమ మైత్రి అలాగే ఉంది. ఎంతదాచినా దాగదులే అన్నట్టు.. గల్లీలో సిగపట్లు, ఢిల్లీలో కౌగిలింతలు.. నిజం కాదని నిరూపించగలరా?” అని షర్మిల ప్రశ్నించారు.

‘‘బీహార్ లో జరిగిన బీజేపీయేతర పక్షాల సమావేశానికి మీకు (బీఆర్ఎస్) ఆహ్వానం ఎందుకు అందలేదో చెప్పే దమ్ముందా? బీజేపీపై కేసీఆర్ తీరు సరిగా లేదని బీహార్ సీఎం నితీశ్ కుమార్ చెప్పేశారు.. శరద్ పవార్ అయితే ఏకంగా బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అన్నారు. ఇంకా మీ నాటకాలు దేనికి?” అని షర్మిల నిలదీశారు.

‘‘తమిళనాడు మాజీ మంత్రిని ఎంత రాక్షసంగా అరెస్టు చేశారో చూశాం. మరి బలమైన సాక్షాలున్నాయంటూ కవితను నాలుగుసార్లు ఆఫీసుల చుట్టూ తిప్పిన సీబీఐ, ఆ తరువాత ఆమెను అరెస్టు ఎందుకు చేయదు? అసలు జాబితాలో ఆమె పేరే ఉండకపోవడమేందో! ఆమె కడిగిన ముత్యమా, లేక మీది కుదిరిన బంధమా? తెలంగాణ మంత్రుల మీద ఈడీ దాడులుంటాయి, కానీ అరెస్టులు ఉండవు” అని విమర్శించారు.

‘‘కేసీఆర్ కుమారుడు ఆగమేఘాల మీద ఢిల్లీకి పోయి అమిత్ షాను కలుస్తాడు. బీజేపీ ముఖ్యమంత్రులు నెలల తరబడి ఎదురుచూస్తున్నా దొరకని అపాయింట్ మెంట్ గాలికంటే వేగంగా ఈయనకు దొరుకుతుంది. సమాజ్దార్ కో ఇషారా కాఫీ అన్నట్టు.. సిగ్గులేకుండా, ఆత్మలు అమ్ముకుని చేతులు కలుపుతున్న వీరి నీచక్రీడలను నాలుగు కోట్ల ప్రజలు గమనిస్తున్నారు. వీరి స్నేహాన్ని బొందపెడతారు” అని అన్నారు.

More Telugu News