Revanth Reddy: సోనియాను బలిదేవత అన్న రేవంత్, ఇప్పుడు సహపంక్తి భోజనం అంటున్నాడు: ప్రశాంత్

  • అమరజ్యోతి నిర్మాణంలో అవినీతి జరిగిందన్న రేవంత్ పై ఆగ్రహం
  • అమరుల త్యాగాలపై మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ కు లేదని వ్యాఖ్య
  • తెలంగాణను కాంగ్రెస్ ఆలస్యం చేయడం వల్లే బలిదానాలు జరిగాయన్న మంత్రి
Minister Vemula Prashanth fires at Revanth Reddy

అమరజ్యోతి నిర్మాణంలో అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మతిలేని మాటలు మాట్లాడుతున్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. అమరుల త్యాగాలను స్మరించుకుంటే ఓర్వలేని కుంచిత మనస్తత్వం రేవంత్, కాంగ్రెస్ ది అని దుయ్యబట్టారు. అమరుల స్థూపాన్ని నిర్మించింది గొప్ప మనసుతో తప్ప, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాదన్నారు. అమరజ్యోతిని సందర్శించి అక్కడ ఏర్పాట్లు చూస్తే నిర్మాణం గొప్పతనం అర్థమవుతుందన్నారు. అమరుల త్యాగాలపై మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ కు లేదన్నారు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్ చేసిన జాప్యం వల్లే బలిదానాలు జరిగాయన్నారు.

ఆనాడు సోనియా గాంధీని బలిదేవత అన్న రేవంత్, ఇప్పుడు అమరుల కుటుంబాలతో సోనియా సహపంక్తి భోజనాలు చేస్తుందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కేసీఆర్, కేటీఆర్ లను వ్యక్తిగతంగా తిడితేనే వార్తల్లో ఉంటామని రేవంత్ భావిస్తున్నారని, అందుకే ఇష్టారీతిన ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలని, కేసీఆర్ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

More Telugu News