TOEFL: ప్రభుత్వ విద్యార్థులకు టోఫెల్ శిక్షణ... ఈటీఎస్ తో ఏపీ ప్రభుత్వ ఒప్పందం

  • విదేశాల్లో చదివేవారికి టోఫెల్ తప్పనిసరి
  • ఆ దిశగా ఏపీ విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ
  • తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ తో ఈటీఎస్ బృందం సమావేశం
AP Govt join hands with ETS to train govt stidents towards TOEFL

విదేశాల్లో చదవాలనుకునే విద్యార్థుల ఆంగ్ల భాషా నైపుణ్యాన్ని పరీక్షించేందుకు టోఫెల్ (టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్) పరీక్ష నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే. 

అయితే, ఏపీలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను కూడా టోఫెల్ కు సన్నద్ధం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ విద్యార్థులకు టోఫెల్ శిక్షణ కోసం ఏపీ సర్కారు ఈటీఎస్ (ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్వీసెస్)తో ఒప్పందం కుదుర్చుకుంది. 

ఇవాళ తాడేపల్లి క్యాంపు కార్యాయంలో సీఎం జగన్, ఈటీఎస్ సీనియర్ డైరెక్టర్ అలైన్ డౌమాస్, ఉన్నతాధికారులు, ఈటీఎస్ ప్రతినిధులు సమావేశమయ్యారు. ప్రభుత్వ విద్యార్థులను టోఫెల్ దిశగా తీర్చిదిద్దడంపై ఈటీఎస్ తో ఒప్పందంపై ఇరువర్గాలు సంతకాలు చేశారు. 

ఈటీఎస్ సీనియర్ డైరెక్టర్ అలైన్ డౌమాస్ మాట్లాడుతూ, ఇది ఏపీలో విద్యారంగం స్వరూపాన్ని మార్చే కార్యక్రమం అని అభివర్ణించారు. సీఎం జగన్ దార్శనిక నాయకత్వంలో ఒప్పందం కుదుర్చుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఏపీ ప్రభుత్వంతో భాగస్వామ్యం అభివృద్ధి దిశగా ముందడుగు అని పేర్కొన్నారు.

ఒప్పందం ముఖ్యాంశాలు...

  • 3 నుంచి 5 తరగతుల వారికి టోఫెల్ ప్రైమరీ పరీక్ష... 6 నుంచి 9 తరగతుల వారికి టోఫెల్ జూనియర్ స్టాండర్డ్ పరీక్ష నిర్వహిస్తారు.
  • 10వ తరగతిలో విద్యార్థులు మాట్లాడే నైపుణ్యాలను అంచనా వేసేందుకు స్పీకింగ్ ఎగ్జామ్ ఉంటుంది.
  • ఈటీఎస్ తో ఒప్పందంలో భాగంగా టోఫెల్ యంగ్ స్టూడెంట్ సిరీస్, టోఫెల్ ప్రైమరీ ప్యాకేజి, టోఫెల్ స్టాండర్డ్ ప్యాకేజి, టోఫెల్ జూనియర్ స్పీకింగ్ పరీక్ష నిర్వహిస్తారు.
  • టోఫెల్ కు సన్నద్ధం చేసే క్రమంలో 3 నుంచి 9వ తరగతుల్లో ఒక్కొక్క విద్యార్థికి రూ.7.50 చొప్పున ప్రభుత్వం ఈటీఎస్ కు చెల్లిస్తుంది.
  • 5 నుంచి 9వ తరగతుల్లో రీడింగ్, లిజనింగ్ పరీక్షల్లో ఉత్తీర్ణులైతే ఒక్కొక్కరికి రూ.600 చెల్లిస్తారు.
  • 9వ తరగతిలో మాట్లాడడంలో ఉత్తీర్ణులైన వారికి ఒక్కొక్కరికి రూ.2,500 చొప్పున ఇస్తారు.
  • ఉత్తమ నైపుణ్యం కనబర్చిన 52 విద్యార్థులు, ఉపాధ్యాయులకు మూడ్రోజులు అమెరికాలో పర్యటించే అవకాశం
  • ఈ పర్యటనలో రవాణా చార్జీలు ప్రభుత్వం, అమెరికాలో వసతి ఖర్చులు ఈటీఎస్ భరిస్తాయి.


More Telugu News