Telangana: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త

  • అలవెన్స్‌లు పెంచుతూ విభాగాల వారీగా ఉత్తర్వుల జారీ
  • ట్రావెలింగ్ అండ్ కన్వీనియన్స్ అలవెన్స్, బదిలీపై వెళ్లే ఉద్యోగులకు ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ 30 శాతం పెంపు
  • సెలవు రోజుల్లో పని చేసే లిఫ్ట్ ఆపరేటర్లకు అదనంగా రూ.150 చెల్లింపు
Telangana Government good news to employees

రాష్ట్రావ‌త‌ర‌ణ‌ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు, పెన్ష‌న‌ర్ల‌కు శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు, పెన్ష‌న‌ర్ల‌కు ఇచ్చే అలవెన్స్‌ను పెంచుతూ విభాగాల వారీగా ఉత్తర్వులను జారీ చేసింది. జీవోలో పేర్కొన్న దాని ప్రకారం, ఉద్యోగులకు ట్రావెలింగ్ అండ్ కన్వీనియన్స్ అలవెన్స్ 30 శాతం, బదిలీపై వెళ్లే ఉద్యోగులకు ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ 30 శాతం పెంచింది. సెలవు రోజుల్లో పనిచేసే లిఫ్ట్ ఆపరేటర్లు, డ్రైవర్లకు అదనంగా రూ.150 చెల్లించాలని నిర్ణయించింది. షెడ్యూల్ ఏరియాలో పనిచేసే ఉద్యోగులకు స్పెషల్ కాంపన్సెంటరీ అలవెన్స్ 30 శాతం పెంచింది.

దివ్యాంగ ఉద్యోగులకు ఇచ్చే కన్వీయన్స్ అలవెన్స్ రూ.2000 నుండి రూ.3000, ఇళ్లు నిర్మించుకునే వారికి ఇచ్చే అడ్వాన్స్ పరిమితిని రూ.20 లక్షల నుండి రూ.30 లక్షలకు, కారు కొనుగోలు చేసే వారికి ఇచ్చే అడ్వాన్స్ పరిమితిని రూ.6 లక్షల నుండి రూ.9 లక్షలకు, మోటార్ సైకిల్ కొనుగోలు చేసే వారికి ఇచ్చే అడ్వాన్స్ రూ.80 వేల నుండి రూ.1 లక్షకు పెంచింది.

ఉద్యోగుల పిల్లల పెళ్లిళ్ల విషయానికి వస్తే కూతురు పెళ్లికి ఇచ్చే అడ్వాన్స్ రూ.1 లక్ష నుండి రూ.4 లక్షలు, కుమారుడి పెళ్లికి ఇచ్చే అడ్వాన్స్ రూ.75 వేల నుండి రూ.3 లక్షలకు, స్టేట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్స్ ఉద్యోగులకు ఇచ్చే ఇన్‌సెంటివ్ ను 30 శాతం పెంచింది. గ్రేహౌండ్స్, ఇంటెలిజెన్స్, ట్రాఫిక్, సీఐడి, ఆక్టోపస్, యాంటి నక్సలైట్ స్క్వాడ్ విభాగాల్లో పని చేసే పోలీసులకు ఇచ్చే స్పెషల్ పేస్‌ను 2020 పే స్కేల్ ప్రకారం వర్తింప చేయనున్నట్లు తెలిపింది. పెన్షన్‌దారులు మృతి చెందితే అందించే తక్షణ సాయాన్ని రూ.20 వేల నుండి రూ.30 వేలకు, ప్రోటోకాల్ డిపార్ట్‌మెంట్‌లో విధులు నిర్వర్తించే అన్ని కేటగిరీల్లోని ఉద్యోగులకు అదనంగా 15 శాతం స్పెషల్ పే మంజూరు చేసింది.

More Telugu News