Suresh Raina: యూరప్ నడిబొడ్డున రెస్టారెంట్ స్థాపించిన రైనా

  • ఆహార ప్రియుడిగా రైనాకు గుర్తింపు
  • నెదర్లాండ్స్ రాజధాని ఆమ్ స్టర్ డామ్ లో రెస్టారెంట్ ఏర్పాటు
  • భారతీయ వంటకాలతో అదరగొడతానంటున్న రైనా
Suresh Raina established a restaurant in Amsterdam

సురేశ్ రైనా... డాషింగ్ బ్యాటింగ్ కు, మెరుపు ఫీల్డింగ్ కు పెట్టింది పేరు. టీమిండియా తరఫున ఆడినా, ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడినా... అభిమానులను అలరించడంలో ఎక్కడా రాజీపడని డైనమిక్ క్రికెటర్... సురేశ్ రైనా. 

క్రికెట్ కు చాన్నాళ్ల క్రితమే వీడ్కోలు పలికిన ఈ ఘజియాబాద్ వాలా ఇప్పుడు తనకిష్టమైన ఆహార రంగంలోకి ప్రవేశించాడు. ఏకంగా, ఖండాంతరాలు దాటి యూరప్ నడిబొడ్డున నెదర్లాండ్స్ రాజధాని ఆమ్ స్టర్ డామ్ లో రెస్టారెంట్ నెలకొల్పాడు.

ప్రధానంగా ఇది ఇండియన్ రెస్టారెంట్. దీని పేరు రైనా ఎస్సార్. భారతదేశపు నిధి నిక్షేపాల్లాంటి వంటలను వండి వార్చుతామంటూ రైనా హామీ ఇస్తున్నాడు. భారత్ వెలుపల రెస్టారెంట్ ఏర్పాటు చేయడంపై రైనా స్పందించాడు. 

తనకు ఆహారం అన్నా, వండటం అన్నా పిచ్చి అని వెల్లడించాడు. భారత్ కు మాత్రమే పరిమితమైన నికార్సయిన రుచులను ఆమ్ స్టర్ డామ్ లోని తన రెస్టారెంట్ లో పరిచయం చేస్తానని తెలిపాడు. ఉత్తర భారతదేశానికి చెందిన మసాలా దట్టించిన వంటకాలు, దక్షిణ భారతదేశ ఘమఘమలు తన రెస్టారెంట్ కు వచ్చినవారిని నోరూరించేలా చేస్తాయని వివరించాడు. 

ఈ రెస్టారెంట్ లో వంటకాలు మాత్రమే కాదు నాణ్యత, సృజనాత్మకత, ప్రతి డిష్ లోనూ సంపూర్ణ సంతృప్తిని అందించడంలో తమ అంకిత భావాన్ని చూస్తారని రైనా పేర్కొన్నాడు.

More Telugu News