Sushil Modi: అందరూ పెళ్లికొడుకులే.. గెస్టులు మాత్రం ఉండరు: విపక్షాల భేటీపై సుశీల్ మోదీ సెటైర్లు

  • ఈరోజు పాట్నాలో సమావేశం కానున్న విపక్ష నేతలు
  • కూర్చొని టీ తాగినంత మాత్రాన ఐక్యత ఉన్నట్టు కాదన్న సుశీల్ మోదీ
  • విపక్షాల మధ్య ఐక్యత లేదని వ్యాఖ్య
Sushil Modi satires on Sushil Modi

రానున్న ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పలు విపక్ష పార్టీలు ఈరోజు బీహార్ రాజధాని పాట్నాలో సమావేశమవుతున్నాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు ఈ సమావేశంపై బీహార్ మాజీ డిప్యూటీ సీఎం, బీజేపీ నేత సుశీల్ మోదీ విమర్శలు గుప్పించారు. విపక్ష నేతలు కలిసి కూర్చొని టీ తాగినంత మాత్రాన విపక్షాల మధ్య ఐక్యత కుదిరినట్టు కాదని అన్నారు. 

ఇది ఒక పెళ్లి తంతు వంటిదని... దీనికి హాజరయ్యే వాళ్లంతా పెళ్లి కొడుకులేనని, అతిథులు మాత్రం ఉండరని సుశీల్ మోదీ ఎద్దేవా చేశారు. తమ కండిషన్లను ఇతరులందరూ అంగీకరించాలనే భావనలో విపక్ష నేతలు ఉంటారని చెప్పారు. అత్యున్నత పదవి కోసం తాము కూడా పోటీదారులమనే భావనలో అందరూ ఉంటారని అన్నారు. ఢిల్లీకి సంబంధించిన ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా తాము చేస్తున్న పోరాటానికి మద్దతు పలుకుతున్నట్టు కాంగ్రెస్ ప్రకటిస్తేనే తాము సమావేశానికి వస్తామని కేజ్రీవాల్ చెప్పారని... ఇలాంటి విషయాలపై విపక్ష నేతలు ఒక అంగీకారానికి వచ్చే అవకాశం ఉందా? అని ప్రశ్నించారు. విపక్షాల మధ్య ఐక్యత లేదని ఆయన స్పష్టం చేశారు.

More Telugu News