K Kavitha: ఆ పత్రికల మనసు మారాలని కోరుకుంటున్నా: ఎమ్మెల్సీ కవిత

  • తెలంగాణ అమ‌ర‌వీరుల‌ను అవ‌మానించే సంస్కృతి తమది కాదన్న కవిత
  • కొన్ని ప‌త్రిక‌లు స‌మైక్య రాష్ట్రంలో అవ‌లంబించిన విధానాలనే పాటిస్తున్నాయని విమర్శ
  • పత్రికలు నిత్యం విషం చిమ్ముతూనే ఉన్నాయ‌ని ఆవేదన
MLC kavitha on section of media

తెలంగాణ అమ‌ర‌వీరుల‌ను అవ‌మానించే సంస్కృతి తమది కాదని, పూజించే సంస్కృతి అని భార‌త జాగృతి అధ్య‌క్షురాలు, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత అన్నారు. అబిడ్స్‌లోని తెలంగాణ సార‌స్వ‌త ప‌రిష‌త్‌లో భార‌త జాగృతి ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన తెలంగాణ సాహిత్య స‌భ‌లో ఆమె మాట్లాడుతూ... తెలంగాణ చ‌రిత్ర‌లో ఇవాళ సువ‌ర్ణ అక్ష‌రాల‌తో లిఖించ‌ద‌గ్గ రోజు అన్నారు. ట్యాంక్ బండ్ వ‌ద్ద ఏర్పాటు చేసిన అమ‌ర‌వీరుల స్థూపాన్ని ఆవిష్క‌రించుకుంటున్నామ‌న్నారు.

నేడు కొన్ని ప‌త్రిక‌లు స‌మైక్య రాష్ట్రంలో అవ‌లంబించిన విధానాలనే పాటిస్తున్నాయన్నారు. అమ‌రుల‌ను త‌ప్ప‌కుండా గౌరవించుకుంటామన్నారు. మ‌న రాష్ట్రం గొప్ప రాష్ట్రమని, మ‌న‌సున్న రాష్ట్రమన్నారు. నిత్యం విషం చిమ్ముతూ, ప్ర‌తి అంశాన్ని రాజ‌కీయం చేసే ఆ ప‌త్రిక‌ల మ‌న‌సు మారాల‌ని కోరుకుంటున్నానని తెలిపారు. అంతేకాదు, కొన్ని పత్రికలు ఇక్కడి జ్యోతులు కావు అంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. 

తెలంగాణ సాహిత్యం మీద గంభీరమైన చర్చ జరగాలన్న ఉద్దేశంతో తెలంగాణ సాహిత్య సభలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పిల్లల్లో భాష మీద మక్కువ పెరగాలన్నారు.

బాల సాహిత్యం ప్రచురణ చేసి స్కూల్ లైబ్రరీలో అందించే ప్రయత్నం చేస్తామ‌న్నారు. తెలంగాణ చరిత్రను భారతదేశవ్యాప్తంగా తెలియజేస్తామని, తెలంగాణలో బౌద్ధం, జైనం మీద బుక్స్ తీసుకువ‌స్తామ‌న్నారు. పాఠశాలల్లో పిల్లలకు సాహిత్యం మీద పట్టు కోసం ప్రత్యేకంగా కార్యక్రమం తీసుకువ‌స్తామ‌న్నారు.

  • Loading...

More Telugu News