adipurush: ఏం చెప్పాలో అర్థం కావడం లేదు.. వాళ్లు మధ్యలోనే వెళ్లిపోదామనుకున్నారు: ఆదిపురుష్‌పై టీవీ 'రామాయణ' లక్ష్మణుడు

  • సినిమాకు ఎందుకు వెళ్లానా అనుకోవాల్సి వచ్చిందన్న సునీల్ లహ్రీ
  • ఆదిపురుష్ చూసి నిరుత్సాహానికి గురయ్యానని వ్యాఖ్య
  • హనుమంతుడి భాషపై అభ్యంతరం
Ramayana Laxman on Adipurush movie

రామానంద్ సాగర్ తీసిన టీవీ సీరియల్ రామాయణంలో లక్ష్మణుడి పాత్రను పోషించిన సునీల్ లహ్రీ... ఆదిపురుష్ సినిమాపై స్పందించారు. బుధవారం ఏఎన్ఐతో ఆయన మాట్లాడుతూ, తాను ఈ సినిమాను చూశానని, కానీ నిరుత్సాహానికి గురయ్యానని చెప్పారు. ఆ సమయంలో ఈ సినిమాకు ఎందుకు వెళ్లానా? అని అనుకోవాల్సి వచ్చిందన్నారు. ఇందులో తనకు నచ్చినవి కేవలం రెండు మాత్రమేనని ఒకటి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, రెండు సినిమాటోగ్రపీ అన్నారు. ఈ రెండు అంశాలను మినహాయించి ఈ సినిమా తనను పూర్తిగా నిరాశపరిచిందన్నారు.

ఈ సినిమాను చూసిన తర్వాత ఎలా రియాక్ట్ కావాలో తనకు అర్థం కాలేదన్నారు. థియేటర్ లో సినిమాను చూస్తున్న ఇతర ప్రేక్షకులు కూడా అసంతృప్తికి లోనయ్యారన్నారు. తన ముందు కూర్చున్న ఇద్దరు మహిళలు మధ్యలో వెళ్లిపోవాలనుకున్నారని, కానీ విజువల్స్ బాగున్నాయని ఆగిపోయారని చెప్పారు. మరో వ్యక్తి రామాయణం పేరుతో ఏం చూపిస్తున్నారని కామెంట్ చేశాడని చెప్పారు. ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకులు అందరూ ఎన్నో అంచనాలతో వస్తారని, కానీ వారి అంచనాలు అందుకోవడంలో చిత్రం విఫలమైందన్నారు.

ఇది మోడర్న్ ఫిల్మ్ కాదన్నారు. ఏ కోణంలో దీనికి ఆధునికతను జోడించారో చెప్పాలన్నారు. రామాయణానికి ఆధునికతను జోడించినట్లు చెప్పారని, కానీ టాటూలు వేయడం, హెయిర్ స్టైల్ మార్చడం ఆధునికత కాదన్నారు. సంభాషణల్లో హనుమంతుడికి వాడిన భాషలో మార్పు చేసి ఉండాల్సిందన్నారు. ఈ సినిమాను ఎవరు తీశారో తనకు తెలియదని, కానీ హనుమంతుడి భాష వీధుల్లో జనాలు మాట్లాడినట్లుగా ఉందన్నారు. ఈ సినిమా పట్ల తాను ఎన్నో అంచనాలు పెట్టుకున్నానని, దీని గురించి ఎంతో చర్చ జరిగిందని, తన వద్దకు మీడియా వచ్చినప్పుడు సినిమా చూడకముందు తాను ఏమీ చెప్పలేనని అన్నానని తెలిపారు. ఇప్పుడు సినిమా చూశాక ఏం చెప్పాలో అర్థం కావడం లేదన్నారు.

More Telugu News