rajaiah: ఎమ్మెల్యే రాజయ్య-సర్పంచ్ నవ్య వ్యవహారంలో కీలక పరిణామం.. పోలీసులకు ఫిర్యాదు

  • ఎమ్మెల్యే సహా నలుగురిపై ధర్మసాగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
  • గ్రామాభివృద్ధికి రూ.25 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే
  • నిధుల విషయంలో అగ్రిమెంట్‌పై సంతకం చేయాలని వేధిస్తున్నారని ఫిర్యాదు
Sarpanch Navya complaint against MLA Rajaiah

స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య, జానకీపురం సర్పంచ్ నవ్య వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అగ్రిమెంట్ పేరుతో తనను వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ ఎమ్మెల్యే రాజయ్య, మరో నలుగురిపై ధర్మసాగర్ పోలీసు స్టేషన్‌లో సర్పంచ్ నవ్య బుధవారం ఫిర్యాదు చేశారు. రాజయ్య తనను లైంగికంగా వేధిస్తున్నారని గతంలో నవ్య ఆరోపణలు చేసి, ఆ తర్వాత సమస్యను సామరస్యంగా పరిష్కరించుకున్నారు. అదే సమయంలో గ్రామాభివృద్ధి కోసం రూ.25 లక్షలు తన నిధుల నుండి ఇస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

ఈ క్రమంలో నిధులు ఇవ్వలేదని, పైగా తాను డబ్బులు తీసుకున్నట్లు ప్రచారం సాగుతోందని నవ్య... ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వచ్చారు. ఈ విషయమై నవ్య భర్త ప్రవీణ్... ఎమ్మెల్యేను నిలదీశారు. దీంతో గ్రామాభివృద్ధికి రూ.25 లక్షలు ఇస్తామని, రూ.20 లక్షలు వ్యక్తిగతంగా ఇస్తామని రాజయ్య హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రవీణ్ కు రూ.7 లక్షలు ఇచ్చారు. మిగతా నగదు ఇవ్వాలని అడిగితే అగ్రిమెంట్ పై సంతకం చేయాలని ఒత్తిడి తెచ్చినట్లు చెప్పారు. గతంలో చేసిన లైంగిక ఆరోపణలు రాజకీయ కోణంలో చేసినవని చెప్పాలన్నారని, అలాగే రూ.20 లక్షలు మళ్లీ అడిగినప్పుడు ఇవ్వాలని చెప్పారన్నారు.

దీనికి సర్పంచ్ భర్త ప్రవీణ్ అంగీకరించకుండా వచ్చారు. ఎమ్మెల్యే... ప్రవీణ్ కు పలుమార్లు ఫోన్ చేశారు. ఆ తర్వాత సర్పంచ్ నవ్యకు ఫోన్ చేసి అగ్రిమెంట్ పై సంతకం పెట్టమని ఒత్తిడి తెచ్చారు. సంతకం చేస్తే తాను తప్పు చేసినట్లవుతుందని నవ్య తిరస్కరిస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే సహా నలుగురిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం జరగకుంటే పోలీస్ కమిషనర్ వద్దకు, మహిళా కమిషన్ వద్దకు వెళ్తానన్నారు నవ్య.

More Telugu News