Chennupati Srinivas: వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడిపై వంగవీటి రంగా బావమరిది చెన్నుపాటి శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • ద్వారంపూడి కుటుంబానికి ఎప్పటి నుంచో రైస్ మిల్లులు, థియేటర్లు ఉన్నాయన్న శ్రీనివాస్
  • ద్వారంపూడి రాజకీయ ప్రస్థానం రంగాతో మొదలయిందని వెల్లడి
  • 1988లో కాకినాడలో రంగాతో భారీ ర్యాలీ, భారీ సభను నిర్వహించారని కితాబు 
  • ఇప్పటికీ ఆయన తమ కుటుంబంతో సన్నిహితంగా ఉంటున్నారని వెల్లడి 
Vangaveeti Ranga btother in law Chennupati Srinivas comments on Dwarampudi Chandrasekhar Reddy

జనసేన అధినేత పవన్ కల్యాణ్, కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిల మధ్య కొనసాగుతున్న విమర్శలు, ప్రతి విమర్శలతో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ఈ క్రమంలో పవన్ కు కాపు నేత ముద్రగడ పద్మనాభం విమర్శలు గుప్పిస్తూ లేఖ రాయడం అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. ఈ నేపథ్యంలో వంగవీటి మోహనరంగా బావమరిది చెన్నుపాటి శ్రీనివాస్ సీన్ లోకి ఎంటరయ్యారు. ద్వారంపూడిపై ఆయన ప్రశంసలు కురిపించారు. వంగవీటి రంగాతోతే ద్వారంపూడి రాజకీయ ప్రస్థానం మొదలయిందని శ్రీనివాస్ చెప్పారు. రంగాపై ఆయన అభిమానం ఇప్పటికీ చెక్కు చెదరలేదని అన్నారు. 

1985 నుంచే తనకు ద్వారంపూడితో పరిచయం ఉందని... వాళ్ల కుటుంబం చాలా రిచ్ అని శ్రీనివాస్ చెప్పారు. వాళ్లకు రైస్ మిల్లులు, సినిమా థియేటర్స్ ఉండేవని తెలిపారు. వంగవీటి తదనంతరం వైఎస్ ని ద్వారంపూడి ఫాలో అయ్యారని, రాజకీయంగా ఎదిగారని చెప్పారు. 1988లో ఎవరూ ధైర్యం చేయని రోజుల్లో రంగాను భారీ ర్యాలీతో తీసుకెళ్లి కాకినాడలో భారీ బహిరంగ సభను ద్వారంపూడి నిర్వహించారని గుర్తుచేశారు. రంగాకు ఆయన అంతటి వీరాభిమాని అని శ్రీనివాస్ చెప్పారు.

ఆయనపై పొంతనలేని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. పూర్తి వివరాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని... ఎవరో చెప్పినవి విని మాట్లాడటం సరికాదని అన్నారు. తాను రాజకీయాలకు దూరంగా ఉన్నాను కాబట్టి... పొలిటికల్ కామెంట్స్ చేయడం లేదని చెప్పారు. ద్వారంపూడి గురించి తనకు పూర్తి విషయాలు తెలుసు కాబట్టే... ఆయనపై వస్తున్న ఆరోపణలను వ్యతిరేకిస్తున్నానని తెలిపారు. తన బావ రంగా చనిపోయి 33 ఏళ్లు గడుస్తున్నా... తమ కుటుంబంతో ఇప్పటికీ ద్వారంపూడి సన్నిహితంగా ఉంటున్నారని చెప్పారు.

More Telugu News