Nara Lokesh: జగన్ రాష్ట్ర పరువు తీశాడు: లోకేశ్

  • ఉమ్మడి నెల్లూరు జిల్లాలో లోకేశ్ యువగళం
  • వెంకటగిరి నియోజకవర్గం డక్కలి రాజన్న ఫ్యామిలీ డాబా వద్ద డిన్నర్ విత్ లోకేశ్
  • తటస్థ ప్రముఖులతో లోకేశ్ సమావేశం
  • వారు చెప్పిన సమస్యలను శ్రద్ధగా విన్న లోకేశ్
  • టీడీపీ వచ్చాక అందరికీ న్యాయం చేస్తుందని భరోసా
Lokesh met people from various sectors

ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో నారా లోకేశ్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సాయంత్రం డక్కలి రాజన్న ఫ్యామిలీ డాబా వద్ద తటస్థ ప్రముఖులతో డిన్నర్ విత్ లోకేశ్ కార్యక్రమం జరిగింది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు లోకేశ్ కు సమస్యలు వివరించారు. దీనిపై లోకేశ్ స్పందించారు. పాదయాత్ర సందర్భంగా అందరి సమస్యలు తెలుసుకుంటున్నానని వెల్లడించారు. 

జగన్ పాలనలో అన్ని రంగాల వారు బాధితులేనని అన్నారు. జగన్ ఏ వర్గానికి న్యాయం చెయ్యలేదని, జగన్ పాలనలో సమాజంలో భయం ఏర్పడిందని తెలిపారు. పాదయాత్రలో తనను కలిస్తే సంక్షేమ కార్యక్రమాలు కట్ చేస్తానని వాలంటీర్లు బెదిరిస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందని వెల్లడించారు. 

"వెంకటగిరికి చిన్న తరహా పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే లోకల్ డెవలప్ మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. తద్వారా స్థానికంగా ఐటీ ఉద్యోగాలు కల్పిస్తాం. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీడీ కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం" అని హామీలు ఇచ్చారు.

వెంకటగిరి చేనేతకు చరిత్ర ఉంది

వెంకటగిరి చేనేత అంటే ఎంతో ప్రసిద్ధి చెందిందని, కానీ ప్రస్తుత మార్కెట్ కి తగ్గట్టుగా డిజైన్స్ ఉండాలని నారా లోకేశ్ అభిప్రాయపడ్డారు. ట్రెండ్ కు అనుగుణంగా నైపుణ్య శిక్షణ ఇవ్వడం, మార్కెట్ లింక్ చేస్తే మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. 

"మంగళగిరిలో ఒక పైలట్ ప్రాజెక్టు చేస్తున్నాను. టాటా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకొని చేనేత కార్మికులకు సాయం చేస్తున్నాను. అది సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తాం" అని చెప్పారు. వెంకటగిరి చీరలు అమ్మ, బ్రహ్మణి కట్టుకుంటారు అని లోకేశ్ వెల్లడించారు. వెంకటగిరి చేనేత కార్మికులను ఆదుకునే బాధ్యత తాను తీసుకుంటానని స్పష్టం చేశారు. 

"పట్టు రైతులకు కూడా జగన్ ప్రభుత్వం బకాయి పడింది. నూలు, రంగులు, ఇతర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. నేను పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేసి పట్టు రైతులను ఆదుకున్నాం. చేనేత మగ్గాల్లో కూడా లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది. వాటిని చేనేత కార్మికులకు అందించాలి. టెక్స్ టైల్ పార్క్ తో వీవర్స్ శాల అనే కొత్త కాన్సెప్ట్ తీసుకురావాలి అనే ఆలోచనలో ఉన్నాం.

జగన్ పాలనలో రాష్ట్రానికి ఏ కంపెనీ రాదు. జగన్ అమర్ రాజా లాంటి ఫ్యాక్టరీని తెలంగాణకి తరిమేశాడు. అక్కడ 20 వేల ఉద్యోగాలను ఏపీ యువత కోల్పోయారు. యూపీలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఏపీకి రావడానికి జగన్ ని చూసి భయపడుతున్నారు.

ఏపీ బ్రాండ్ ని జగన్ దెబ్బతీశారు!

టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పారిశ్రామికవేత్తల్లో నమ్మకం కల్పించాల్సి ఉందని లోకేశ్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాలు మారిన ప్రతిసారీ పాలసీలు మార్చడం రాష్ట్ర భవిష్యత్తుకి మంచిది కాదని పేర్కొన్నారు. జగన్ పాలనలో వ్యాపారస్తులపై బాదుడే బాదుడు, కరెంట్ ఛార్జీలు, చెత్త పన్ను, బోర్డు పన్ను అంటూ అనేక పన్నులు వేసి ఇబ్బంది పెట్టడం వలన చిరు వ్యాపారులు ఎవ్వరూ సంతోషంగా లేరని తెలిపారు. 

"గత ముఖ్యమంత్రులు ఎవరూ రాష్ట్రం పరువు తియ్యలేదు. జగన్ రాష్ట్ర పరువు తీశాడు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే పీపీఏలు రద్దు చేసి దేశవ్యాప్తంగా రాష్ట్ర పరువు తీశాడు" అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు.

లోకేశ్ ఇంకా ఏమన్నారంటే...!

  • జగన్ పాలనలో సాగు, తాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత లేదు.
  • నీరు ఉన్నా సాగుకు నీరు ఇవ్వలేని దుస్థితి జగన్ పాలనలో ఉంది. 
  • టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ లో ఉన్న సాగు, తాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం.
  • రైతులను ఆదుకోవడానికి హార్టి కల్చర్ ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తాం.
  • రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేసి మామిడి, అరటి, బొప్పాయి, దానిమ్మ, ఖర్జూరం, అంజూర్ లాంటి పంటల్లో వివిధ రకాల మొక్కలు అందుబాటులోకి తీసుకొస్తాం.
  • జగన్ పాలనలో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. 
  • టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్టుబడి తగ్గించి గిట్టుబాటు ధర కల్పిస్తాం.
  • అప్కొస్ తీసుకురావడం తప్ప జగన్ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులని ఉద్ధరించింది ఏమీ లేదు. 
  • టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మీ న్యాయమైన సమస్యలు పరిష్కరిస్తాం.
  • ఏపీపీఎస్సీని  బలోపేతం చేస్తాం. ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇచ్చి పెండింగ్ లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు అన్ని భర్తీ చేస్తాం.
  • జగన్ పాలనలో నాడు-నేడు అంటూ ప్రచార ఆర్భాటం తప్ప చిత్తశుద్ది లేదు.
  • నూతన విద్యా విధానం అంటూ జగన్ స్కూల్స్ మూసేస్తున్నాడు. దీని వలన పిల్లలు విద్యకు దూరం అవుతున్నారు.
  • ఎక్కువ మంది ఐఏఎస్, ఐపీఎస్ లు ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారే. 
  • టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తాం. కేజీ నుండి పీజీ వరకూ పాఠ్యాంశాలు ప్రక్షాళన చేస్తాం.
  • ఫౌండేషన్ బాగుంటే స్కిల్ డెవలప్ మెంట్ అవసరం పెద్దగా ఉండదు.
  • జగన్ పాలనలో ప్రభుత్వ ఆసుపత్రిల్లో దుర్భరమైన పరిస్థితి ఉంది. కనీస సౌకర్యాలు లేవు, డాక్టర్లు లేరు.
  • టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వసతులు కల్పిస్తాం.

యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర వివరాలు:

ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 1703.7 కి.మీ.
ఈరోజు నడిచిన దూరం 16.9 కి.మీ.

133వ రోజు పాదయాత్ర వివరాలు (21-6-2023):
వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గం (తిరుపతి జిల్లా):
సాయంత్రం
2.00 – డక్కిలి క్యాంప్ సైట్ లో చేనేతలతో ముఖాముఖి.
4.00 – డక్కిలి క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
4.50 – లింగసముద్రంలో స్థానికులతో సమావేశం.
5.20 – మాపూరు పాయింట్ వద్ద స్థానికులతో మాటామంతీ.
6.40 – నాగవోలులో స్థానికులతో సమావేశం. 
7.00 – మిట్టపాలెంలో స్థానికులతో సమావేశం.
9.00 – వెంకటగిరి శివారు కమ్మపాలెం విడిది కేంద్రంలో బస.
**

More Telugu News