Janasena: ఎంపీ ఇంట్లో జరిగిన కిడ్నాప్‌పై జనసేన నేత షాకింగ్ కామెంట్స్

  • ఎంపీ ఎవీవీ సత్యనారాయణ ఇంట్లో జరిగింది కిడ్నాప్ కాదు.. సెటిల్మెంట్ అని ఆరోపణ
  • ఎంపీ విశాఖపట్నంను వదిలి వెళ్లాలని జనసేన మూర్తి డిమాండ్
  • భూకుంభకోణాలపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్
Janasena leader comments on visakha MP family kidnap issue

వైసీపీ నేత, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ విశాఖపట్నంను వదిలి వెళ్లాలని జనసేన పార్టీ నేత, కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. ఇటీవల ఎంపీ ఇంట్లో కిడ్నాప్ వ్యవహారం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. మూర్తి యాదవ్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ... ఎంపీ ఇంట్లో జరిగింది కిడ్నాప్ కాదని, సెటిల్మెంట్ అని ఆరోపించారు.

ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ బాధితులు చాలామంది ఉన్నారని, కబ్జాలు లేకుండా ఆయన వెంచర్ వేయరన్నారు. ఎంపీ కాకముందు ఆయన జైల్లో ఉన్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. ఎంవీవీ నీతులు చెబుతే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంటుందన్నారు. విశాఖలో భూకుంభకోణాలపై జాతీయ దర్యాఫ్తు సంస్థ సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

విశాఖ ఎంపీ కుటుంబం కిడ్నాప్ అంశం ఇటీవల చర్చనీయాంశంగా మారింది. ఈ కిడ్నాప్ వెనుక కుట్రకోణం దాగి ఉందని బీజేపీ నేతలు కూడా ఇటీవల అనుమానం వ్యక్తం చేశారు. ఎంపీ నివాసానికి రౌడీ వెళ్లాడంటే అది సాధారణ విషయం కాదని, కిడ్నాప్ వ్యవహారం సినిమా కథను మించిపోయిందని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు ఇటీవల అన్నారు.

More Telugu News